లాక్డౌన్ అమలవుతున్న వేళ మద్యం సేవించిన యువతులు బెంగళూరులో నానా హంగామా చేశారు. డ్యూటీ చేస్తున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగడం గమనార్హం. ఏకంగా పోలీసుల వాహనాన్ని ఢీకొట్టేందుకు యత్నించారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కర్ణాటక పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారున. బెంగళూరులో అనేక చోట్ల చెక్పోస్టులను ఏర్పాటు చేసి అత్యవసరాలకు వెళ్లే వారిని మాత్రమే రాకపోకలకు అనుమతిస్తున్నారు.
లీలా ప్యాలెస్ సమీపంలోని చెక్పోస్టు వద్దకు ఓ కారులో నలుగురు యువతులు ఫుల్లుగా మద్యం సేవించి ప్రయాణిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే వాహనాన్ని నిలిపి ఇంకా మద్యం బాటిళ్లు ఏమైనా ఉన్నాయోమే అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. అయితే పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేయడాన్ని ఆ నలుగురు యువతులు అస్సలు సహించలేకపో యారు. ఏకంగా పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. మమ్మల్నే ఆపుతారా..? మీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తారంటూ నానా యాగీ చేశారు. తమ వద్ద పాసులున్నప్పటికీ ఇలా చేయడమేంటని వాగ్వాదానికి దిగారు.
మా వద్ద పాస్ ఉందని, మాకు ఉన్నతాధికారులు తెలుసంటూ యువతులు గొడవకు దిగారు. మద్యం తాగారని స్పష్టం కావడంతో దాన్ని ధ్రువీకరించుకునేందుకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతుండగా యువతులు పోలీసులపైకి వాహనాన్ని దూకించే యత్నం చేసి ఉడాయించారు. పోలీసులు బైక్పై కిలోమీటర్ దూరం వరకు వెంటాడినా ప్రయోజనం లేకపోయింది. యువతులు వేగంగా ప్రయాణించి పక్కసందుల్లోంచి తప్పించుకున్నారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తప్పించుకున్నవారంతా కాలేజ్ స్టూడెంట్స్గా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇలాంటి సంఘటనలు బెంగళూరులోనే ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం. గడిచిన వారంలో ఇది మూడో సంఘటనగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తమిళనాడులో కూడా మందుబాబులు వీరంగం సృష్టించారు.