మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందని అన్నారు. అరెస్టుచేసే ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగిందని.... ఆ విషయం చెప్పినా వినకుండా అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారని పేర్కొన్నారు. దీంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సివచ్చిందని చెప్పారు. 


 
అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పిందని.... 10 రోజులు బెడ్‍ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏమిటని ప్రశ్నించారు. అసలీ అర్థరాత్రి కుట్రలేంటి? అని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని అన్నారు. ఇది కేసు విచారణలా లేదని... బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయని పేర్కొన్నారు. 


 
ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైసిపి ల్యాండ్ మాఫియాపై, 108 అంబులెన్స్ స్కామ్ మీద, ఆవభూముల స్కామ్ పై, ఇసుక మాఫియాపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయని గుర్తు చేశారు. అధికారం చేతిలో ఉందికదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని... కుట్రలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: