వజిద్ అనే యువకుడు రమ్య అనే యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రమ్య కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. అంతే కాకుండా రమ్యను బెంగళూరులోని విద్యారన్యపురలో ఉన్న మహిళా దక్షత సమితి భవనంలో బంధించారు. దీనిపై వాజిద్ హైకోర్టును ఆశ్రయించారు. ‘నేను, నా కోలీగ్ రమ్య ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. అయితే మా ఇద్దరి తల్లిందండ్రులూ దీనికి అంగీకరించలేదు. రమ్య తల్లిదండ్రులు ఆమెను వేరే చోట బంధించారు. అమ్మ, నాన్న నన్ను కూడా ఇంటి నుంచి కదలకుండా చేశారు. మాకు కోర్టే న్యాయం కల్పించాలి’ అంటూ హైకోర్టులో హెబియస్ కార్పర్ పిటిషన్ వేశాడు. రమ్య స్టేట్మెంట్ను కూడా రికార్టు చేసి తన పిటిషన్కు జత చేసి కోర్టుకు అందించాడు.
వజిద్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ‘మన దేశంలో మేజర్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్లు ఇష్టపడే వారిని వివాహం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది. ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన స్వేచ్ఛ విషయంలో కులానికి కానీ మతానికి కానీ ప్రవేశం లేదు. ఇది ప్రాథమిక హక్కు. దీనిని ఎవరూ కాదనలేదు’ అని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎస్ సుజాత, జస్టిస్ సచిన్ శంకర్ మాగడంలు సంయుక్తంగా ఈ తీర్పునిచ్చారు.