దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వంద రూపాయలు దాటింది. దీంతో వాహనదారులు పెట్రోల్ కొట్టించుకోవాలంటేనే వణుకుతున్నారు. టాక్సీవాలా లో మాత్రం పెరిగిన ధరలతో, కరోనా విజృంభన ఎఫెక్ట్ తో బతుకు బండి నడపడం ఇబ్బందిగా తయారైంది. ఇదే సమయంలో ఒక చల్లని వార్త వారికి తెలిసింది. అదేంటంటే ఉచితంగా మూడు లీటర్ల పెట్రోల్ ఇస్తున్నారని జనాలు ఆశతో ఎదురుచూస్తున్నారు.
అయితే ఆ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చెప్పండి.. మేము కూడా వెళ్లి ఉచితంగా ట్యాంకులు నిలుపుకుందాం అనుకుంటున్నారా..? అయితే అది సాధ్యం కాని పని.. ! ఎందుకంటే ఆ పెట్రోల్ బంక్ కేరళ రాష్ట్రంలో ఉంది. ఆ పెట్రోల్ బంకు యజమాన్యం ఆటోరిక్షాలకు మాత్రమే మూడు లీటర్ల పెట్రోలు పోస్తున్నారు. అయితే ఈ పెట్రోల్ ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు అనేది మీకు వచ్చిన సందేహం..? దీనికి ఒక బలమైన కారణం ఉంది. కరోనా ఎఫెక్ట్ ఆటోవాలా జీవితంపై చాలా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. దీనికి తోడు ఇంధన ధరలు పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఆటో రిక్షా వాళ్లకు మరింత గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి కాస్త ఉపశమనాన్ని ఇచ్చేందుకు మూడు లీటర్ల పెట్రోల్ ఇస్తున్నామని పెట్రోల్ బంక్ యజమాని సిద్దిక్ అన్నారు. ఇది సాయం కోసం చేసిన దానమే కానీ, వ్యాపారం పెంచుకోవాలన్న ఉద్దేశం కాదని తెలిపారు.