ఏపీలో అధికార వైసీపీలో సీనియర్లు వర్సెస్ జూనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు కాస్త పార్టీ అధినేత జగన్కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక అన్నింటికి మించి నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. జగన్ ఈ జిల్లాలో ఎవ్వరూ ఊహించని విధంగా జిల్లాకు చెందిన జూనియర్లు అయిన అనిల్ కుమార్ యాదవ్, గౌతంరెడ్డికి మంత్రి పదవులు ఇవ్వడంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం కరోనా టైంలో కాకాణి చేసిన సేవా కార్యక్రమాలతో ఆయన ఇమేజ్ ఓ రేంజ్లో పెరిగింది. ఇక కోవూరు ఎమ్మెల్యే తన సేవా కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు పడుతున్నారన్న అసంతృప్తితో ఉన్నారు. దీని వెనక జిల్లాకు చెందిన మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతంరెడ్డి పరోక్షంగా అధికారులను ప్రోత్సహిస్తున్నారన్న టాక్ ప్రసన్న కుమార్ రెడ్డి వర్గాల్లో ఉంది. దీనిపై ఆయన నేరుగా జగన్కు ఫిర్యాదు చేసేందుకు అపాయింట్ మెంట్ కూడా కోరారని అంటున్నారు.
ఇక మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ టైంలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఆయన కూడా మంత్రి పదవి కావాలని అంటున్నారు. అయితే మధ్యలో వైఎస్ మరణం తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ చెంత చేరి జగన్ను తీవ్రంగా తిట్టారు. ఇక గత ఎన్నికలకు ముందు ఆయన రాజకీయ భవిష్యత్తు కోసమే ఆనం వైసీపీలో చేరి వెంకటగిరి సీటు దక్కించుకుని ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వెంకటగిరిలో మౌనికా రెడ్డి అనే మహిళ కార్యక్రమాలను మంత్రులు అనిల్కుమార్, కోటంరెడ్డి ఎంకరేజ్ చేస్తున్నారట.
తన నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికే చెందిన ఓ మహిళ కార్యక్రమాలకు అనిల్, కోటంరెడ్డి సహకారం ఉండడంతో ఆనం తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా రెండో విడతలో అయినా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న ప్రసన్నకుమార్, ఆనంకు ఇలాంటి టైంలో జూనియర్ల నుంచి వ్యూహాత్మకంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న చర్చలు అయితే జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి జగన్ ఈ రెండు వర్గాల మధ్య ఎలా సయోధ్య కుదుర్చుతారో ? చూడాలి.