జమిలి ఎన్నికల విషయంలో చంద్రబాబునాయుడు ఎంతగా జపం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలం అయిన వెంటనే చంద్రబాబు జమిలి భజన మొదలుపెట్టేశారు. ఏ ముహూర్తింలో ప్రధానమంత్రి నరేంద్రమోడి జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారో అప్పటి నుండి చంద్రబాబు అసలు జమిలిని వదలటం లేదు. నిజంగానే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందా ? అన్నదే పెద్ద ప్రశ్న. మొదట్లో జమిలి ఎన్నికలపై మాట్లాడిన మోడి దాని అవకాశాలను అన్వేషించమని ఎన్నికల కమీషన్ కు ఆదేశించారు. దాని ప్రకారం కేంద్ర ఎన్నికల కమీషన్ దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయపార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు కోరింది. సమావేశం తర్వాత అర్ధమయ్యిందేమంటే జమిలి ఎన్నికలు సాధ్యం కాదని.
తర్వాత మోడి జమిలిపై మాట్లాడటమే మానేశారు. మోడి మాట్లాడటం మానేసినా చంద్రబాబు మాత్రం దాన్నే పట్టుకుని ఊగులాడుతున్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్నే ప్రస్తావిస్తున్నారు. తాజాగా కడప జిల్లా నేతలతో మాట్లాడిన సందర్భంలో కూడా తొందరలోనే జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయన్నారు. నేతలు, కార్యకర్తలు జమిలి ఎన్నికలకు రెడీ అయిపోవాలని పిలుపు కూడా ఇచ్చేయటం ఆశ్చర్యమేస్తోంది. చంద్రబాబు ఆలోచన ఎంతసేపు ఎలాగుందంటే ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలు జరిగిపోవాలి, తాను మళ్ళీ ముఖ్యమంత్రయిపోవాలంతే.
ఇదే విషయమై పార్టీ నేతలు మాట్లాడుతూ జమిలి ఎన్నికలు సాధ్యంకాదని చంద్రబాబుకు కూడా బాగా తెలుసన్నారు. కాకపోతే తరచూ జమిలి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే పార్టీ నేతలను, క్యాడర్ ను కాపాడుకోవటానికేనట. వైసీపీ దెబ్బకు పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అవకాశం ఉన్నవారు పార్టీ మారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ మారే అవకాశం లేనివారు మాత్రమే పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి వాళ్ళను పార్టీ మారకుండా ఉంచేందుకు, పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు మాత్రమే జమిలి ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని తమ్ముళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు జమిలి జపం వెనుక కతేందో తెలిసిపోయింది కదా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి