పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోంది. గతంలో చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే... 2018 నాటికి పోలవరం కట్టేస్తా అన్నారు.. కానీ.. చంద్రబాబు 2019లో దిగిపోయినా అప్పటికి పోలవరం నిర్మాణం కాలేదు.. మా హయాంలో 80 శాతం కట్టేశామని ఇప్పుడు తెలుగు దేశం చెప్పుకుంటోంది. ఇక జగన్ అధికారంలోకి వచ్చి కూడా మూడేళ్లు దాటిపోయింది. అయినా పోలవరం అడుగులు ముందుకు పడటం లేదు. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం కాంట్రాక్టర్ ను మార్చేశారు.


రివర్స్ టెండరింగ్ అంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత వరదలన్నారు. మళ్లీ ఇప్పుడు డయాఫ్రం వాల్ తెగిపోయింది అంటున్నారు. దాన్ని మళ్లీ నిర్మించాలి.. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టం అని సాక్షాత్తూ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో మరోసారి పార్లమెంటులో పోలవరం ప్రస్తావన వచ్చింది. పోలవరం గడువును మరోసారి కేంద్రం పొడిగించింది. 2024 జూలై నాటికి పోలవరం పూర్తి సాధ్యమని పార్లమెంటుకు కేంద్రం తెలిపింది.


వాస్తవానికి 2022 ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని.. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా జాప్యం అవుతోందని రాజ్యసభకు చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ తెలిపినట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యానికి ఏపీ ప్రభుత్వ వైఖరే ప్రధాన కారణం అన్న కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు టీడీపీ ఎంపీ కనకమేడల అంటున్నారు. పోలవరంపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిందని చెబుతున్నారు.


టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా కేంద్రం బదులిచ్చిందట. ఏపీకి ఖర్చు పెట్టే సామర్ధ్యం తక్కువ ఉంది... కానీ... నిర్మాణ, నిర్వహణ అంతా లోప భూయిష్టంగా ఉందని ఆ సమాధానంలో చెప్పారట. వ్యూహాత్మక ప్రణాళికా లేకపోవడం వల్ల కూడా పోలవరం జాప్యం అవుతోందన్న కేంద్రం.. ఏపీకి పోలవరం ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏజెన్సీతో సమన్వయ లోపం కూడా ప్రాజెక్టు నిర్మాణం లో జాప్యానికి ప్రధాన కారణమే అని జలశక్తి మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: