కేసీఆర్ రెండుసార్లు సీఎంగా అధికారంలో ఉండి.. ఈ ఉమ్మడి కరీంనగర్‌ ప్రాంతానికి ఏం చేశారో చెప్పగలరా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా..ఈ ప్రాంతంలో పసుపు రైతుల కష్టాలు తీరాయా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఎకరాకు లక్ష 50వేలు పెట్టుబడి పెడితే.. పసుపు రైతులకు ఆత్మహత్యలే దిక్కవుతున్నాయని.. ఈ ప్రాంతంలో ఆనాడు రత్నాకర్ రావు చేసిన అభివృద్దే తప్ప బీఆరెస్ ప్రభుత్వం చేసిందేం లేదని.. బీఆరెస్ ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


2011లో శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ బీఆరెస్ కు మద్దతు తెలిపిందన్న రేవంత్ రెడ్డి.. కోట్ల రూపాయలు తీసుకుని ఆనాడు ఈ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కిరణ్ కుమార్ రెడ్డికి అమ్ముడుపోయింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఆనాడు టీఆరెస్ నుంచి ఎమ్మెల్యే సస్పెండ్ చేసింది నిజం కాదా అన్న రేవంత్ రెడ్డి.. తన ఓటును ఆంధ్రోళ్లకు అమ్ముకున్న విద్యా సాగర్ రావుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ టికెట్ ఇచ్చారన్నారు. అంటే ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయినదాంట్లో కేసీఆర్ వాటా ఎంత? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని కవిత హామీ ఇచ్చారని.. పరిశ్రమను తెరవకపోతే గేటుకు ఉరేసుకుంటానని ఎమ్మెల్యే అన్నారని.. మాట తప్పిన కవితను పార్లమెంటు ఎన్నికల్లో పాతాళానికి తొక్కిండ్రని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును ఎందుకు విడిచిపెట్టిండ్రని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు తలచుకుంటే కవితనే పాతాళానికి తొక్కిండ్రు.. విద్యాసాగర్ రావు ఒక లెక్కనా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరునెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తాం.. పసుపు బోర్డు తెస్తానన్న గుండు.. బోర్డు తిప్పేశారని రేవంత్ రెడ్డి అన్నారు.


ఎన్నో త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నేరవేర్చలేదని.. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ ను అసదుద్దీన్ ఎందుకు ప్రశ్నించరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: