అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ శిల్పా బ్రదర్స్కు బాగా కలిసొచ్చింది. మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలవగా, చక్రపాణిరెడ్డి శ్రీశైలం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై 38 వేల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి చక్రపాణి రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదొక చోట పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు.
ఇంకా నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యని పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇటీవలే వెలుగోడు మండలం రేగడగూడూరు, మాధవరం, మోతుకూరు గ్రామాల్లో పైపు లైన్ ద్వారా రక్షిత మంచి నీటి సరఫరా వ్యవస్థని ప్రారంభించారు. రాజకీయ పరంగా చూసుకుంటే ఇక్కడ శిల్పా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అటు టీడీపీ తరుపున బుడ్డా రాజశేఖర్ రెడ్డి పెద్దగా పార్టీలో కనిపించడం లేదు. అయితే బుడ్డా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి, టీడీపీలోకి వచ్చారు. వైసీపీని వదులుకోవడం ఆయనకు బాగా నెగిటివ్ అయింది. మొత్తానికైతే శ్రీశైలంలో శిల్పా దెబ్బకు టీడీపీ కోలుకోలేకపోతుందనే చెప్పొచ్చు.