ఇందులో విశ్వనాథునికి కవిత్వంపై ఉన్న మక్కువతో కథ మొదలవుతుంది. తదుపరి ఆయన ‘రామాయణ కల్పవృక్షం’ పుస్తకం చదువుతున్న వారసుని మదిలో మెదిలేలా విశ్వనాథ వారి జీవిత విశేషాలను చెబుతూ కథను ముందుకు నడిపారు. విశ్వనాథ సత్యనారాయణ వారి పాత్ర పరిచయ ప్రారంభంలో ‘శ్రీహరి స్తోత్రం’ “జగజ్జాల పాలం…” అంటూ నేపథ్యంలో వినిపించడం విశేషం! తన మాతృభాష తెలుగు ఏమైపోతుందో అన్న ఆవేదన వ్యక్తం చేస్తూ విశ్వనాథవారు రాసుకుంటూ ఉండగా ‘కవిసమ్రాట్’ ముగుస్తుంది.బయోపిక్ అయినా, సినిమాలో ఆకట్టుకోవడం కొన్ని కల్పిత సన్నివేశాలను జోడీ చేసుకొనే రూపొందుతుంది. అందుకు ‘కవిసమ్రాట్’ చిత్రమూ మినహాయింపేమీ కాదు. దర్శకుడు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయడం సముచితంగా ఉంది. ఓ సన్నివేశంలో “ఈ విశ్వనాథ నడయాడే గిరిశిఖరం… మూడు గ్రహాల విగ్రహం… అనుగ్రహం- నిగ్రహం- ఆగ్రహం…” వంటి విశ్వనాథుని పదాలను అనువుగా ఉపయోగించడం బాగుంది. “అనుభవమే అక్షరమవుతుంది. ఎంతగొప్పగా అనుభవాలను పోగేసుకోగలిగితే అంత గొప్పగా అక్షరాలని పేర్చగలం…” వంటి సంభాషణలు సాహితీప్రియుల మదిని దోచేస్తాయి. “కష్టం ఎప్పుడు నీ గడప తొక్కినా… ఈ గడపవైపు చూడాలని మరచిపోకు…” వంటి మాటలు హృదయాలను ద్రవింప చేస్తాయి. చివరలో తన తండ్రి విశ్వనాథ గురించి పావని శాస్త్రి మాటలు, చూపిన ఆయన లేఖలు సాహితీ ప్రియులను అలరించక మానవు.
ఎంతోమంది సాహితీప్రియులకు విశ్వనాథ సత్యనారాయణ ఆరాధ్యులు. నటుడు, రచయిత ఎల్. బి. శ్రీరామ్ సైతం కవిసమ్రాట్టుపై తనకున్న అభిమానాన్ని ఈ సినిమా తీసి తనదైన పంథాలో చాటుకున్నారని చెప్పవచ్చు. ఇంతకు ముందుచిత్రాల్లో కనిపించిన ఎల్బీ శ్రీరామ్, ఇందులో నటించిన వారు ఒక్కరే అంటే అచ్చెరువు కలుగక మానదు. ఆ కవిసమ్రాట్టును మన కళ్ళ ముందు నడయాడేలా చేయడంలో ఎల్బీ శ్రీరామ్ లోని నటుడు కృతకృత్యులయ్యారనే చెప్పాలి. సందర్భాను సారంగా సాగిన సంభాషణలు, వాటికి తగ్గ రీతిలో సన్నివేశాలను తెరకెక్కించిన సవిత్ చంద్ర ప్రతిభనూ అభినందించకుండా ఉండలేం. ఏది ఏమైనా గంటకుపైగా సాగే ఈ చిత్రం విశ్వనాథునిపై అభిమానం ఉన్నవారినే ఆకట్టుకోగలదు. ‘ఆహా’ ఓటీటీలో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. వ్యాపారాత్మక హంగులేవీ లేని ‘కవిసమ్రాట్’ ఎంతమందిని ఆకర్షించగలదో చెప్పలేం.