ఇక దిల్ రాజు వ్యవహారంపై ఇండస్ట్రీ వర్గాల్లో ఇంటా బయటా కూడా కొన్ని విమర్శలు ఉన్న మాట వాస్తవం. చాలా మంచి సినిమాలను సైతం నైజాంలో ఆయన చెప్పిన రేటుకే ఇవ్వాలని... లేకపోతే ఆ సినిమాకు ఎక్కువ థియేటర్లు రానివ్వరన్న టాక్ ఆయనపై ఉంది. తాజాగా రవితేజ క్రాక్ సినిమా సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లోకి మంచి టాక్తో దూసుకు పోతోంది. ఈ సినిమాను నైజాంలో వరంగల్ శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ పంపిణీ చేశారు. అయితే రాజు రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు పంపిణీ చేశారు.
తన సినిమాల కోసం క్రాక్ను మంచి థియేటర్లలో నుంచి తీసివేయించారని.. వరంగల్ శ్రీను ఆరోపిస్తున్నారు. అసలు రిలీజ్కు ముందు అడ్వాన్స్లు లేకుండా దిల్ రాజుకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చివర్లో వరంగల్ శ్రీను ఎంట్రీ ఇచ్చి క్రాక్ను ఆదుకున్నారు. అయినా రాజు క్రాక్ను చాలా థియేటర్లలో నుంచి లేపేయడంపై శ్రీను ప్రెస్ మీట్ పెట్టి విరుచుకు పడ్డారు. చివరకు సురేష్ బాబు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ విషయంపై భగ్గుమన్నట్టు తెలుస్తోంది.
చివరకు ఓయూ జేఏసీ నేతలు కూడా రంగంలోకి దిగి రాజు వ్యవహారాలపై హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరో వైపు రాజు - శిరీష్ గతంలో కూడా పలు సినిమాలకు లెక్కలు చెప్పలేదని కొందరు మెగాస్టార్ చిరంజీవికి ఫిర్యాదు చేయడంతో ఆయన కూడా ఆరాలు తీస్తున్నారట. ఏదేమైనా రాజుకు వ్యతిరేకంగా ఇండస్ట్రీలో ఓ గ్రూపు బలంగా తయారవుతోన్నట్టే ఉంది.