సూపర్ స్టార్ మహేష్ బాబు ని సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక్కడు అనే చెప్పాలి. ఒక రకంగా మహేష్ బాబు కెరీర్లో ఇది మొదటి  బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అప్పటి దాకా చాక్లెట్ బాయ్ అనిపించుకున్న మహేష్ బాబు ఒక్క సారిగా ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ లో కూడా అలజడి రేపాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2003వ సంవత్సరంలో జనవరి 15వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 18 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్కడు సినిమా పోస్టర్లు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. 


ఒక్కడు సినిమా పోస్టర్ ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నమ్రత "మహేష్ సినిమాలన్నిటిలో ఒక్కడు క్లాసిక్, ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది, ఒక్కడు నాకు ఆల్ టైం ఫేవరేట్ , కాలంతో పాటు ఈ సినిమా వన్నె ఇంకా పెరుగుతూనే ఉంటుంది" అంటూ ఆమె రాసుకొచ్చింది. అంతేకాక ఆ పోస్ట్ కింద ఈ సినిమాలో హీరో, హీరోయిన్, దర్శకుడు, విలన్, సంగీత దర్శకుడు లాంటి వాళ్ళ పేర్లు అన్ని మేన్షన్ చేసింది కానీ సినిమా నిర్మాతని మెన్షన్ మాత్రం మర్చిపోయింది. 


దీంతో ఈ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు హర్ట్ అయ్యి "పొరపాట్లు జరుగుతూ ఉంటాయి బాబు ఒక్కడు సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత అయిన నన్నే నమ్రత  మరిచిపోయారు, అయితేనేమి ఒక్కడు సినిమా ఆమెకు ఫేవరెట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను", గుడ్ లక్ అంటూ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చర్చనీయాంశం కావడంతో ఎట్టకేలకు నమ్రత తన తప్పు తెలుసుకుని తన ఇంస్టాగ్రామ్ పోస్టులో ఎం.ఎస్.రాజు పేరును కూడా చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: