ఇంటర్నెట్ డెస్క్: దృశ్యం 2 సినిమాకు సంబంధించి ఆ సినిమాలోని హీరో మోహన్‌లాల్, క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సినిమాపై అశ్విన్ కామెంట్ చేయడం, దానిని మోహన్‌లాల్ సమాధానమివ్వడంతో ప్రస్తుతం తమిళ ప్రేక్షకులు తెగ హ్యాపీ అవుతున్నారు. ఇటీవల ట్విటర్‌లో అశ్విన్ దృశ్యం సినిమాకు సంబంధించి ఓ ట్వీట్ చేశాడు. సినిమా చాలా బాగుందని, కోర్టులో మోహన్ లాల్ ఇచ్చిన ట్విస్ట్‌కు తాను నవ్వేశానని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు.

‘దృశ్యం-2 సినిమాలో జార్జ్‌కుట్టి (మోహన్‌లాల్‌) కోర్టులో ఇచ్చిన ట్విస్ట్‌ చూసి పగలబడి నవ్వాను. నేను చెప్పేది అర్థం కాకపోతే వెంటనే మొదటి నుంచి చూడండి. దృశ్యం-1 చూడండి. అద్భుతం, అసలైన అద్భుతం(ఈ సినిమా).’ అని అశ్విన్‌ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీనికి మోహన్‌లాల్‌ మంగళవారం స్పందించాడు. ‘ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా సినిమా చూసి మీ అభిప్రాయాన్ని పంచుకొన్నందుకు ధన్యవాదాలు. ఇది మాకెంతో గొప్ప విషయం. కెరీర్‌లో మీకు అంతా శుభం జరగాలి’ అని రిప్లై మోహన్‌లాల్ చెప్పారు.

ఇదిలా ఉంటే దృశ్యం-2 సినిమా ఇంతకుముందు వచ్చిన దృశ్యం-1 సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా సినిమా విడుదలైంది. దృశ్యం-1 అప్పట్లో కలెక్షన్ల పరంగా అద్భుత రికార్డు సాధించింది. రూ.50 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలి మళయాల చిత్రంగా నిలిచింది.

సినిమా అనేక భాషల్లో రీమేక్ అయింది. హిందీ, తమిళ్, తెలుగు వంటి దేశీయ భాషల్లోనే కాకుండా సింహళం, చైనీస్ లో కూడా సినిమాను రీమేక్ చేశారంటే ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక సరిగ్గా 8ఏళ్ల తరువాత ఈ సినిమాకు మళ్లీ ఇప్పుడు దృశ్యం-2 రూపంలో రీమేక్ వచ్చింది. ఈ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: