
మమ్ముట్టి, జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'యాత్ర' సినిమా వైఎస్ఆర్ బయోపిక్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. దివంగత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిజజీవితంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని.. దానికి సినిమాటిక్ టచ్ జోడించి యాత్ర సినిమాని చక్కటి పొలిటికల్ డ్రామా గా రూపొందించిన మహి వి. రాఘవ్ రెడ్డి పై ప్రశంసల జల్లు కురిసిందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలో 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను స్వయంగా ఎలా తెలుసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు.
అయితే పాదయాత్ర సమయంలో రాజశేఖర్ రెడ్డి, ప్రజల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆద్యంతం భావోద్వేగంగా కొనసాగుతాయి. ఈ సినిమా మొత్తంలో మనసులను కదిలించే సంభాషణలు ఎన్నో ఉంటాయి. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ మహనేత రాజశేఖర రెడ్డి రైతులకు భరోసా ఇస్తూ చెప్పే డైలాగులు కూడా మనసుని నేరుగా తాకుతాయి. రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రేక్షకులను ఫిదా చేశారని చెప్పుకోవచ్చు.
ప్రజల గుండెల్లో దేవుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా మారారు? 2004వ సంవత్సరంలో తన పార్టీని ఎలా గెలిపించగలిగారు? పాదయాత్ర సమయంలో వైఎస్ ఎలాంటి అనుభవాలు చవిచూశారు? ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వంటి అంశాలకు సంబంధించిన సన్నివేశాలను చాలా చక్కగా తెరకెక్కించిన మహి వి. రాఘవ్ రెడ్డి క్లైమాక్స్ తో ప్రేక్షకులందరినీ కంటతడి పెట్టించారు. ఒక పొలిటీషియన్ ఒక మహోన్నత నేత గా మారిన యాత్రను దృశ్యకావ్యంగా మలచడంలో దర్శకుడు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు అని చెప్పుకోవచ్చు. ఐతే టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన అన్ని పొలిటికల్ డ్రామాలలో యాత్ర సినిమా 'ది బెస్ట్ అండ్ మోస్ట్ ఎమోషనల్ పొలిటికల్ బయోపిక్' అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.