మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ వద్ద ఒకదాని తర్వాత మరో రికార్డులను బద్దలు కొడుతునే ఉంది. ఇప్పటికే మలయాళంలో అత్యధిక గ్రాస్ వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మెల్ బాయ్స్ తాజాగా మరో భారీ మైలురాయిని  కూడా అధిగమించి వావ్ అనిపించింది. తమిళనాడులో ఏకంగా 50 కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించింది. విమర్శకుల ప్రశంసలతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ అన్ని విధాలుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుందీ సినిమా. మొత్తంగా చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిన ఆరో పరభాష సినిమాగా రికార్డ్ సృష్టించింది.ఇప్పటి వరకు ఈ ఘనత దక్కిన సినిమాలు బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, అవతార్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మంజుమ్మెల్ బాయ్స్ తమిళ డబ్బింగ్ వెర్షన్ లేకుండానే ఈ క్లబ్ లో చేరింది. మలయాళ వెర్షన్ లో తమిళనాడులో విడుదలైన ఈ సినిమా ఈ అరుదైన రికార్డు సాధించింది.


ఇప్పటి దాకా ఏ సినిమా కూడా తమిళ డబ్బింగ్ లేకుండా ఈ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందు మరే మలయాళ సినిమా తమిళనాడులో కనీసం 5 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేయలేదు. అలాంటిది ఈ సినిమా ఏకంగా 50 కోట్ల మైలురాయి దాటడం అంటే సాధారణమైన విషయం కాదు.ఇక ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 190 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇంకా 200 కోట్లవైపు దూసుకుపోతుంది. ఇక తెలుగు, హిందీ వెర్షన్ డబ్బింగ్ కార్యక్రమాలు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. తెలుగు వెర్షన్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వచ్చే శుక్రవారం విడుదల చేయనుంది. నిజ జీవితంలో కొచ్చిన్ కు చెందిన ఓ స్నేహితుల బృందం కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్లగా తరువాత అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ కు చిదంబరం దర్శకత్వం వహించారు. థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు ఫ్రెండ్షిప్ లోని ఎమోషన్స్ పలికించిన తీరు ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: