ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని నిమ్మకూరు గ్రామం… ఆ పేరు వినగానే ప్రతి తెలుగు మనసుకు గుర్తుకొచ్చే మహానటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, పేదల సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్పిన నేత, దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. అదే నిమ్మకూరే సంగీత స్వగ్రామం. కానీ ఈ సంగీత అనే మహిళకు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం సాధారణం కాదు… అది భక్తి స్థాయిలో ఉంటుంది. 1982లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి, కేవలం ఏడాది తిరక్కుండా 1983లో ఏపీ సీఎం కుర్చీ అధిరోహించారు. ఆ క్షణం నుంచి సంగీత గుండెల్లో ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానానికి రెక్కలు వచ్చాయి. ఆ ఉత్సాహం, ఆ మోజు అంతలా పెరిగి… తన గ్రామాన్ని, కుటుంబాన్ని వదిలి, నేరుగా హైదరాబాద్‌కు వచ్చేసింది. అప్పటివరకు హైదరాబాద్‌తో ఎలాంటి పరిచయం లేకపోయినా, ఎలా అయినా తన అభిమాన నాయకుడిని రోజూ చూడాలని సంకల్పించింది.


సచివాలయం పక్కనే ఓ చిన్న బడ్డీ కొట్టు వేసుకుని, అక్కడే తన జీవితాన్ని స్థిరపరుచుకుంది. ఎన్టీఆర్ సచివాలయానికి వస్తూ, పోతూ ఉండగా, దూరం నుంచి ఆయనను చూసి ఆనందంతో మురిసిపోయేది. ఆ క్షణాల కోసం రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్కపెట్టకుండా గడిపేసింది. 1995లో ఎన్టీఆర్ అనారోగ్యంతో పరమపదించారు. కానీ ఆయనపై సంగీతకు ఉన్న ప్రేమ, అభిమానానికి ఆ మరణం కూడా అంతం కాలేదు. నేటికీ… అవును, ఎన్టీఆర్‌ను మొదట చూసిన చోటే ఆమె బడ్డీ కొట్టు కొనసాగిస్తోంది. 42 ఏళ్లుగా అదే స్థలంలో వ్యాపారం చేస్తూ, అన్నగారి ఫొటోలు పెట్టుకుని వాటిని చూసుకుంటూ గడుపుతోంది. కొట్టుకు వచ్చే ప్రతి ఒక్కరికి తన కథ చెబుతూ, ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని పంచుకుంటూ కాలం గడుపుతోంది.



కానీ కాలం ఎవ్వరినీ వదలదు. యుక్తవయసులో ఎన్టీఆర్ కోసం నగరానికి వచ్చిన ఆ సంగీత, నేడు వృద్ధాప్యం దశలోకి అడుగుపెట్టింది. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సంపాదన కూడా తన రోజు వారీ జీవనానికి సరిపడేంత మాత్రమే. 42 ఏళ్లుగా ఒకే స్థలంలో తన అభిమాన నాయకుడి జ్ఞాపకాలతో జీవిస్తున్న ఈ అభిమాని, ఇప్పుడు ఒక్కటే ఆశతో ఉన్నారు – నందమూరి కుటుంబం నుంచి ఎవరో ఒక‌రు తనను ఆదుకోవాలి. ఎన్టీఆర్‌పై అజరామరమైన ప్రేమతో, తన ఊరిని వదిలి, జీవితాన్ని సచివాలయం పక్కన గడిపేసిన ఈ సంగీత గాథ… తెలుగు ప్రజల హృదయాలను కదిలించేలా ఉంది. నిజంగా, ఆమె త్యాగానికి గౌరవంగా నందమూరి వారసులు చేయూత అందిస్తారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: