ఇద్దరు మంత్రులు ఏం చెప్పినా చెల్లుతుంది
ఏం మాట్లాడినా అది గొప్ప భాష అయి
ఉద్గ్రంథ రీతిని అందుకుంటుంది
వారేం చెప్పినా కూడా మనకు నీతి వాక్యం
ఆ విధంగా రాయడం ఇప్పటి మీ మరియు నా ధర్మం
మనుషులు ఎందరున్నా మనుషుల నైజం ఎలా ఉన్నా అందరినీ ఏకతాటిపై నిలిపే వ్యక్తిత్వం మాత్రం రాజకీయ నేతలకు ఉండాలి. భాష , నడవడి అన్నవి వ్యక్తిత్వాలను మరింత ఉన్నతీకరణ చేస్తాయి. ఒక స్థాయికి చేరుకున్నాక వ్యక్తులను అంతా గమనిస్తారు. నాయకుడిగా ఉంటే వారి గమనాన్ని వీలున్నంత మేర పరిశీలిస్తారు. ఆదర్శనీయం అయితే అనుసరణ చేయడం మాత్రం ఇష్టంగానే చేసుకుంటారు. కానీ ఇక్కడ వైసీపీ సర్కారులో గత ప్రభుత్వం తమను ఫలానా విధంగా చేసిందన్న సాకుతో నోటికి వచ్చిందంతా భాషగానే చెలామణీ చేయిస్తున్నారు. ఆఖరికి భువనేశ్వరి విషయమై వైసీపీ నాయకులు ఎన్ని సార్లు క్షమాపణలు చెప్పినా సరే వివాదం మాత్రం ఓ కొలిక్కిరావడం లేదు. ఆఖరికి కాళ్లు పట్టుకుని బతిమలాడినా సరే వివాదం మాత్రం సర్దుమణిగేలా లేదనే చెబుతున్నాయి నడుస్తున్న పరిణామాలు సంబంధిత పర్యవసనాలు కూడా!
ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు మంత్రుల నోటికి అదుపే లేకుండా పోతోంది. అయినా విశాఖ ఉక్కు గురించి కొడాలి నాని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తారు అని విపక్షం అడిగితే అంతెత్తున లేస్తారు. పరిశ్రమల శాఖ ఎవరు చూస్తున్నారు గౌతం రెడ్డి మరి మాట్లాడుతున్నదెవరు కొడాలి నాని ఇంతకుమించి మరొక నిబంధన అతిక్రమణ ఉంటుందా? కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ మీడియాతో మాట్లాడే పద్ధతి అస్సలు బాగోదు. విశాఖ ఉక్కు సంగతి ప్రశాంత్ కిశోర్ తేలుస్తారని చెప్పడం ఏంటి? ఆయనెవ్వరు తేల్చేందుకు వారేమయినా ఈ ప్రభుత్వానికి అధిపతి హోదాలో ఉన్నారా లేదా మంత్రి బాధ్యతలు ఏమయినా నిర్వహణ చేస్తున్నారా... అదేవిధంగా సినిమా టిక్కెట్ల వ్యవహారంపై కూడా విపక్ష సభ్యులను, జనసేన అధినేత పవన్ ను టార్గెట్ గా చేసుకుని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు మంత్రి పేర్ని నాని. ఇవేంటని అడిగితే రౌడీలతో బెదిరిస్తారు. ఇంకా చెప్పాలంటే
నరికేస్తాం అని హెచ్చరిస్తారు. నిన్నటి వేళ సుబ్బారావు గుప్తా అన్న మాటలు ఏమయినా తప్పున్నాయా.. మంత్రుల భాష కారణంగా పార్టీ గ్రాఫ్ పడిపోతుందని అనడంలో తప్పేంటి? అయినా సుభానీ చర్యను ఏ ఒక్క మంత్రి అయినా ఇప్పటికైనా ఖండించారా?