భారతీయ జనతా పార్టీ నేతల వైఖరి అర్ధం కావటం లేదు. ఒకవైపు చంద్రబాబునాయుడు పాలనపై ఆరోపణలు చేస్తారు. ఇంకోవైపు పాలన మొత్తం అవినీతి మయమని దుమ్మెత్తిపోస్తారు. అదే సమయంలో తక్షణమే విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తారు. చంద్రబాబు అవినీతికి ఆధారాలు ఇవిగో అంటూ కొన్ని కాగితాలను చూపిస్తారు. అయితే, విచారణ మాత్రం జరగటం లేదు. ఇక్కడే బిజెపి నేతల ఆరోపణలపై అందరిలోనూ అనుమానాలు వస్తున్నాయి. బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణలు, చూపిస్తున్న ఆధారాలు నిజమే అయితే కేంద్రప్రభుత్వం విచారణ ఎందుకు జరిపించటం లేదు ? కేంద్రంలో ఉన్నది బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వమే కదా ?
2 జి స్పెక్ట్రమ్ కన్నా అవినీతట
తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ, అధికారుల వ్యక్తిగత ఖాతాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ. 51, 450 కోట్లు ఉంచిందని ఆరోపించారు. యూపిఏ హయాంలో జరిగిన 2 జి స్పెక్ట్రమ్ కుంభకోణం కన్నా ఈ అవినీతి చాలా పెద్దదంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఖాతాలు వాస్తవం. ఖాతాల్లో ఉంచిన డబ్బూ వాస్తవమే అయినపుడు విచారణ ఎందుకు జరగటం లేదు ?
కాగ్ నివేదికపై విచారణేది ?
ఎంఎల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పోలవరం, పట్టిసీమల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రతీ రోజూ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. పట్టిసీమలో రూ. 370 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేల్చిందని బిజెపి ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే ఆరోపించారు. వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ చెప్పినా కేంద్రం ఎందుకు ఇప్పటి వరకూ మాట్లాడటం లేదు ? కాగ్ నివేదికను ఆధారంగా చేసుకుని విచారణ జరిపించవచ్చు కదా ? అన్న ప్రశ్నకు బిజెపి నేతల నుండి సమాధానం ఉండదు.
పాలనంతా అవినీతి మయమేనట !
సోము వీర్రాజు పదే పదే చేస్తున్న ఆరోపణల్లో నీరు-చెట్టు పథకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి ప్రధానమైనవి. రాజు గారు చేస్తున్న ఆరోపణల ప్రకారమే పై రెండు పథకాల్లో సుమారు రూ. 8 వేల కోట్ల అవినీతి జరిగుంటుంది. బిజెపి నేతలు చేస్తున్న ఆరోపణల ప్రకారం అవినీతి జరిగినట్లు చెబుతున్న వన్నీ దాదాపు కేంద్ర పథకాలు, కేంద్రం ఇస్తున్న నిధులే. కేంద్ర పథకాల్లో అవినీతి జరుగుతున్నదని తెలిసిన తర్వాత విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉంది కదా ? మరి ఎందుకు ఇంకా ఉపేక్షిస్తోంది ?
ఎన్నికల తర్వాత మళ్ళీ కలిసిపోతారా ?
చంద్రబాబుపై ఆరోపణలే తప్ప సామాన్యుల మదిలోని ప్రశ్నలకు బిజెపి నేతలు సమాధానాలు చెప్పటం లేదు. దాంతో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే టిడిపి-బిజెపి ఏమైనా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడిపై చంద్రబాబు సవాళ్ళు విసరటం, ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతలు కూడా ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. ఇరువైపుల నుండి ఆరోపణలు, విమర్శలు మీడియాకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఎన్నికల వరకూ ఇలాగే జరుగుతూ ఎన్నికల తర్వాత అవసరమైతే మళ్ళీ బిజెపి-చంద్రబాబు ఏకమైపోతారేమో ?