దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యం గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయం నిత్యం వార్తల్లో వస్తూనే ఉంది.. ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది వాయు కాలుష్యం. పొద్దున లేచినప్పటి నుండి ముఖానికి మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి.. ఇలా ఒక ఢిల్లీయే కాదు.. దేశంలోని అనేక నగరాల్లో, పట్టణాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉంది. కాని వాయు కాలుష్యం విషయంలో మన హైదరాబాద్ మాత్రం సేఫ్ జోన్లో ఉందని తేలిందట.
మొత్తానికి వాయు కాలుష్యం అధికంగా ఉన్న నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. కోలకతా తర్వాతి స్థానంలో ఉన్నట్టు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెల్లడించింది. అత్యంత ఎక్కువగా వాయుకాలుష్యం ఉన్న వాటిని రెడ్ జోన్లో, సాధారణ స్థాయిలో వాయు కాలుష్యం ఉన్న వాటిని గ్రీన్ జోన్ పరిధిలో చేర్చి సీపీసీబీ ఓ జాబితా విడుదల చేసింది. వీటిలో మన భాగ్యనగరం గ్రీన్ జోన్ లో ఉంది. కాకపోతే హైదరాబాద్లో నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ సాధారణ స్థాయి కంటే 4 పాయింట్లు ఎక్కువున్నట్టు తేలింది.
ఇక దక్షిణాదిన సేఫ్ జోన్ లో ఉన్న నగరాలు ఏంటంటే ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు ఉన్నాయి. ఇక మన రాష్ట్రంలో కాలుష్యం జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాల కంటే కొంచెం అధికంగా ఉన్నట్లు తేలడంతో దీనికోసం ప్రభుత్వం ‘స్పెషల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటుచేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ కమిటీ ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది.
ఇక హైదరాబాద్, నగర శివార్లలోని పటాన్చెరు పారిశ్రామికవాడతో పాటుగా నల్లగొండ జిల్లాలో గాలి నాణ్యత ప్రమాణాలకు మించి కాలుష్యం నమోదవుతున్నట్లు గుర్తించింది. ఇకపోతే రెడ్జోన్ లో ఉన్న నగరాలు. ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ, ఫరీదాబాద్, భివాని, హిసార్, ఫతేహబాద్, గురుగ్రామ్, లక్నో, బహదుర్ఘర్, భటిండా, భీవాండి, హాపూర్, బులంద్షహర్, అంబాలా, అమృత్స ర్, రోహతక్, పటౌడి, కాన్పూర్. కాగా గ్రీన్జోన్ లో ఉన్న నగరాలు..
హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, చెన్నై, బెంగళూరు, మైసూరు, కొచ్చి మొదలైనవి ఉన్నాయి . అయితే హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరుగుదల, పరిశ్రమల కాలుష్య ఉద్గారాలు, రోడ్డుపై ధూళి, దుమ్ము విస్తరించడం వంటి కారణాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరంలోని అధికారులు చెబుతున్నారు...