పుర్రెకో బుద్ధి... జిహ్వకో రుచి అన్నారు పెద్దలు... ఈ పాడు సమాజంలో ఎవరు ఎప్పుడు ? ఎలా ఆలోచిస్తారో కూడా తెలియడం లేదు. నాలుగైదు రోజుల క్రితం పెళ్లయ్యి పదేళ్లైన ఓ ఇళ్లాలు మళ్లీ తన పాత ప్రియుడు తన కోసం పెళ్లి చేసుకోలేదని తెలిసి అతడిని పెళ్లాడతానని చెప్పడంతో అందుకు ఆమె భర్త అంగీకరించి తన భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్న సంఘటన చూశాం. ఇక ఇప్పుడు తాజాగా పెళ్లి అయి ఓ వ్యక్తికి భార్య అయిన యువతి తన ప్రియుడితో పారి పోయేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్ అయ్యింది.
చివరకు ఆమె తన ప్రియుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో గ్రామ పెద్దలు వేలంలో ప్రియుడు ఆ యువతిని 1.50 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఒడిశా లోని సుందర్ ఘడ్ జిల్లాలోని మడియా కుదర్ గ్రామంలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన ఓ యువతికి యే నెలలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు చిరుబెడా గ్రామానికి చెందిన పురాణ్ సింగ్ అనే యువకుడితో ప్రేమాయణం ఉంది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ యువతిని ఇంట్లో వాళ్లు మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు.
పెళ్లి అయినా కూడా ఆ యువతి తన ప్రియుడు పురాణ్ సింగ్ను సీక్రెట్గా కలుస్తూ ఉండేది. ఈ విషయాన్ని పసిగట్టిన భర్త ఆమెతో పలు సార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆ యువతి భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఆమె, బస్టాండ్ లో గ్రామస్తులకు పట్టుబడింది. ఇద్దరినీ తాళ్లతో కట్టేసిన గ్రామస్తులు, పురాణ్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించారు.
ఈ క్రమంలోనే వారిద్దరిని పెట్టి గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. పెళ్లి నిమిత్తం ఖర్చు పెట్టిన రూ. 1.50 లక్షలు వెనక్కు ఇచ్చేసి వెళ్లిపోవచ్చని చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్రియురాలిని సొంతం చేసుకునేందుకు ఓకే చెప్పిన పురాణ్ సింగ్ రూ. 50 వేలు ఇచ్చి, మిగతా డబ్బు త్వరలోనే ఇస్తానని చెప్పి, ప్రియురాలిని తీసుకుని వెళ్లాడు. ఇప్పుడు ఈ తంతు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.