దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ కేసులో సంచలన, తక్షణ తీర్పు ఊహించని రీతిలో వెలువడిన సంగతి తెలిసిందే. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... వేగంగా దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో...పోలీసులు అర్ధరాత్రి రీకన్స్ట్రక్ట్ చేసే క్రమంలో భాగంగా పోలీసులు అర్ధరాత్రి నిందితుల్ని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. సీన్ రీకనస్ట్రక్షన్ జరుగుతుండగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులపై ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. ఇప్పుడు సంఘటన స్థలంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. ఎక్కడైతే దిశను దారుణంగా కాల్చేశారో, అక్కడికి సరిగ్గా 300 మీటర్ల దూరంలో నిందితులు ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలు చెల్లాచెదరుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరి డెడ్ బాడీలు పొలాల మధ్య 30 మీటర్ల విస్తీర్ణంలో పడివున్నాయి. ఈ ప్రాంతంలో చుట్టూ చెట్లు, పొదలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మృతదేహాలను పరిశీలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు. చటాన్ పల్లి జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జ్ కింద సీన్ రీకన్ స్ట్రక్షన్ సమయంలో వీరంతా పారిపోయేందుకు ప్రయత్నించి...పోలీసులు ఆయుధాలు లాక్కోవడంతో పాటు రాళ్లను విసురుతూ పొలాల మీదుగా పరిగెత్తేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపి వారిని హతమార్చిన సంగతి తెలిసిందే.
కాగా, తెల్లవారుజామున ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసును పగలు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ప్రయత్నిస్తే నిందితుల్ని ప్రజలే కొట్టిచంపేస్తారని అనుమానంతో తెల్లవారుజామున చేసినట్లు సమాచారం. కాగా, ఎన్కౌంటర్ జరిగిన చోట ఏం జరిగింది.. ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే దానిపై పూర్తి సమాచారం తెలుసుకోవడం కోసం సీపీ సజ్జనార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసులను అడిగి ఆయన సమాచారం తెలుసుకుంటున్నారు.