రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్సీని వ్యతిరేకించింది. ఇప్పుడు ఎన్పీఆర్ కు కూడా వ్యతిరేకంగా మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ ప్రభుత్వానికి మజ్లిన్ మిత్రపక్షంగా ఉన్నది. ప్రభుత్వంలో లేకపోయినా ఆ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తున్నది. అందుకే వాళ్లకు వ్యతిరేకంగా తెరాస పార్టీ నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నది. ఎందుకంటే హైదరాబాద్ లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులకు వాళ్లతో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు.
అందుకే వారిని మంచి చేసుకోవడానికి వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే వారిని వ్యతిరేకంగా ఉన్నది అని భావించిన ఎన్ఆర్సిని, సిఏఏ ను ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనికి వ్యతిరేకంగా జరిగిన నిజామాబాద్ సభకు తెరాస పార్టీ నేతలు కూడా హాజరయ్యారు. ఇకపోతే, 2011 లెక్కల ప్రకారం తెలంగాణ పరిధిలో 3.53 కోట్లు ఉండగా అంచనాల ప్రకారం 2019 నాటికి 3.89 కోట్లకు చేరిందని అంచనా వేస్తున్నారు.
ఇక ఇందులో ఐదేళ్లలోపు పిల్లలు 29.10 లక్షలు ఉండగా 13.9 లక్షల మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు. 5 నుంచి 18 ఏళ్లలోపు జనాభా 95.4 లక్షలుండగా 82.13 లక్షల మందికి ఆధార్ కార్డులు జారీ చేయడం జరిగింది. 18 ఏళ్లు దాటిన జనాభా 2.65 కోట్లుగా ఉండగా 2.99 కోట్ల లెక్కన ఆధార్ కార్డులు జారీ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అంటే జనాభా కంటే ఆధార్ కార్డులు ఎక్కువ సంఖ్యలో జారీ చేశారు.
మిగతా జిల్లాల్లో కంటే హైదరాబాద్ లోనే జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది. హైదరాబాద్ లో జనాభా 44.5లక్షల మంది జనాభా ఉండగా... 67.09లక్షల ఆధార్ కార్డులున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి విద్య, ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటున్న వ్యక్తులు ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులే ఆధార్ కార్డులను తీసుకుంటున్నారని తెలుస్తోంది.