తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ నేతలు తెగ బాకాలు ఊదుకుంటూ తప్పెట గుళ్లు మోగించుకుంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కేసీఆర్ ను ఒక నాయకుడిగా ఎదుర్కొనే అంత సీన్ ఏ పార్టీలో ఉన్న నాయకుడికి లేదనే చెప్పాలి. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయి... ఏదో కాలం కలిసి రావడంతో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బిజెపి... అక్కడ నుంచి తమకు తిరుగులేదని సంబరాలు చేసుకుంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఈ ఎన్నికల్లో బిజెపి పరువు పోయింది. అయినా కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు డప్పులు కొట్టుకుంటున్నారు. చివరకు ఈ విషయం కేంద్ర నాయకత్వానికి తెలియడంతో మోడీ తెలంగాణ బీజేపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సిట్టింగ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను మార్చి ఆయన స్థానంలో వేరొకరిని నియమించాలని యోచించింది. కానీ ఇంతవరకూ కేసీఆర్ కు సరితూగే నాయకుడిని బీజేపీ కనుగొనలేకపోయింది. తెలంగాణ బీజేపీలో బహుళ నాయకత్వం ఉన్నా.. వాళ్లు ఎవ్వరూ కేసీఆర్కు సరితూగే వాళ్లే లేరు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో మురళీధర్ రావు, ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకే అరుణ, ఇంద్రసేనారెడ్డిలున్నారు.
వీళ్లను టీ బీజేపీ పెద్దలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో వీళ్లపై కేంద్ర బీజేపీ నాయకత్వం తీవ్ర అసహనంతో ఉందట. ఇక ఈ విషయం ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా కేసీఆర్కు సైతం తెలియడంతో ఆయన సైతం ఫుల్ హ్యాపీగా ఉన్నారన్న చర్చలు కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇటీవల వార్తలు వనిపిస్తున్నాయి.