రైల్లో సాధారణ మానవుడికి బెర్త్ దొరకడమే కష్టం. రైల్ ప్రయాణంలో బెర్త్ దొరకని వారు నిల్చొని ప్రయాణం చేయాల్సిందే. అలాంటిది రైల్లో శివుడికి ఒక్క బెర్తును కేటాయించడం పై పలువురు ఆశ్చర్యపోయారు. కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ బెర్త్‌ను పరమశివుడికి రిజర్వ్ చేసిన విషయమై ఐఆర్‌సీటీసీ వివరణ ఇచ్చింది. ఇది ఒక్కసారికే పరిమితమని తెలిపింది.

 

దేశంలో మూడో ప్రయివేట్ రైలు అయిన కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారణాసి-ఇండోర్‌ నగరాల మధ్య ప్రయాణించే ఈ రైలు ద్వారా మూడు జ్యోతిర్లింగాలు.. ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, కాశీ విశ్వనాథ్‌లను దర్శించుకోవచ్చు. ఈ రైల్లో బి5 కోచ్‌ లో 64వ నంబర్ సీటును ఓ చిన్నపాటి గుడిగా మార్చేశారు. 64వ నంబర్ సీటును మహా శివుడికి రిజర్వ్ చేశారు. దేవుడి ఫొటోలు, పూలతో ఆ బెర్త్‌ను అందంగా అలకరించారు. ఈ విషయాన్ని నార్త్ రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ పీటీఐతో తెలిపారు.

 

మహాకాళేశ్వరుడికి ఓ బెర్తును రిజర్వ్ చేశారని వార్తలు వెలువడటం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ట్విట్టర్ లో ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేసిన ఆయన.. భారత రాజ్యాంగ పీఠిక ఫొటోను పోస్టు చేశారు. శివుడికి శాశ్వతంగా బెర్త్ కేటాయించే యోచనలో ఉన్నారనే వార్తల పట్ల.. ఇండియన్ రైల్వేస్ అనుబంధ విభాగం ఐఆర్‌సీటీసీ స్పందించింది.

 

కాశీ - మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ సక్సెస్ కావాలని కోరుతూ.. పూజ కోసం 64వ నంబర్ బెర్తుపై పరమశివుడి చిత్రపటాలను సిబ్బంది తాత్కాలికంగా ఉంచారని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ఆదివారం నాడు రైలు ప్రారంభోత్సవం రోజున ప్రయాణికులను అనుమతించలేదని తెలిపారు. ఈ నెల 20 నుంచి రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అప్పటి నుంచి శివుడికి బెర్త్ ఉండదని యాజమాన్యం మరో సారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: