పాలిటిక్స్లో చాలా మంది నియంతలు ఉంటారు.. వాళ్ల నియోజకవర్గానికి వారు ఓ సామంత రాజులుగా ఫీలవుతుంటారు... అది వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ నియంతల్లో కొందరు మరీ అరాచక వాదులుగా తయారై మితిమీరిపోయి విశ్వామిత్రుడి రేంజ్లో గర్వభంగంతో ఉంటారు. ఈ లిస్టులో మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టాప్ ప్లేసులో ఉంటారు. పదేళ్ల పాటు దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకం అంతా ఇంతా కాదు. ప్రభుత్వ అధికారులు అక్కడ పనిచేయాలంటేనే జడిసిపోయేవారు. ఎప్పుడు చింతమనేని నుంచి ఫోన్ వస్తుందో ? ఏం బూతులు తిడతాడురా ? బాబూ అని బెంబెలెత్తుతూ భయంభయంగా ఉద్యోగాలు చేసేవారు.
ఒక వనజాక్షి వ్యవహారమే కాదు.. చివరకు సొంత పార్టీ నేతలు సైతం చింతమనేనిని తిట్టే బూతులు చెవులతో వింటూ పైకి ఉబకి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాము... ఈ దుర్మార్గుడితో మాకు తిట్లా ఏం పాపం చేసుకుని పుట్టాం రాం బాబు అని తీవ్రంగా మదన పడేవారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చి.. చింతమనేనికి విప్ పదవి రావడంతో ఆయన దుర్మార్గాలు, అరాచకాలు మరింత పేట్రేగాయి. ఇక 1947లో స్వాతంత్య్ర భారతంలో హైదరాబాద్ నైజాం సంస్థానం మాదిరిగా దెందులూరు మారిపోయింది. పైగా ఈ పవన్లు.. జగన్లు ఇద్దరు వచ్చి తనపై పోటీ చేసి గెలవాలని సవాళ్లు రువ్వాడు చింతమనేని.
సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా సదరు ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంటే ఆయన ఓడిపోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటారు... కానీ దెందులూరుకు వచ్చేసరికి చింతమనేని ఓటమిపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. ఆయన అరాచకాలతో విసిగి దేశ, విదేశాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకున్నారు. ఇక్కడ ఎవరని పోటీకి పెట్టాలో ముందు జగన్కు కూడా అర్థం కాలేదు. టిక్కెట్ కోసం మాకు మాకు అంటూ కొందరు ఎగబడ్డారు. ఇక జగన్కు అత్యంత సన్నిహితుడు, వివాద రహితుడు అయిన కొఠారు అబ్బయ్య చౌదరి జగన్ మదిలో మెదిలారు.
యూరప్లో ఉన్నత ఉద్యోగం వదులుకుని దెందులూరులో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మాటకు వస్తే ఈ అబ్బయ్య ఇంట్లోనే చింతమనేని రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాడు. పైగా అబ్బయ్యను ఆఫ్ట్రాల్ తనకు పోటీయే కాదన్నాడు... ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. చింతమనేనిని ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగిన అబ్బయ్యతో పాటు ఆయన అనుచరులపై రోజుకు పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. నియోజకవర్గం అంతా కలియ దిరిగిన అబ్బయ్య సామాన్య జనాల్లోకి చొచ్చుకుపోయారు. చింతమనేని మాస్ అని చెప్పుకుంటూ అబ్బయ్య క్లాస్ స్టైల్తో మాస్ను మెప్పించాడు.
దెందులూరు ప్రజలకు కావాల్సింది అరాచకం కాదు అభివృద్ధి అని ఒప్పించాడు.. చివరకు అటు జగన్ వేవ్.. ఇటు అబ్బయ్య వ్యక్తిత్వం.. కలిసి చింతమనేని ఏకంగా 17 వేల ఓట్ల మెజార్టీతో మట్టి కరిచాడు. చింతమనేని అరాచక రాజ్యంలో మెరిసి చింతమనేని ఎప్పుడు ఓడతాడా ? అని ఎదురు చూసిన కోట్లమందిని మురిపించాడు... ఈ సంగ్రామంలో విజేతగా నిలిచాడు. ఈ 9 నెలల్లో దెందులూరులో అద్భుతాలు జరగకపోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నారు.. పెద్దలకు అవమానాలు లేవు... ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు.. అక్రమ కేసులు లేవు.. ప్రకృతి సంపద దోపిడీ లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అబ్బయ్య దూకుడు దెబ్బతో చింతమనేని బేల చూపులు చూడడం తప్పా చేసేదేం లేకుండా పోతోంది.