లాక్డౌన్ వల్ల జనజీవనం ఓ రేంజ్లో స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. అన్నీ నగదుతో ముడిపడిన ప్రస్తుత తరుణంలో...డబ్బుల కోసం తిప్పలు ఓ రేంజ్లో ఉన్నాయి. కరోనా వ్యాప్తి భయంతో బ్యాంకుల బ్రాంచుల్లోకి చాలా తక్కువ మంది కస్టమర్లనే అనుమతిస్తున్నారు. దీంతో జనం చూపు ఏటీఎంలపై పడింది. సాధారణ ఖాతాలతో పాటుగా మహిళలు, వయోధికులు, రైతులు, వితంతువులు, వికలాంగులు ఇబ్బందిపడకుండా జన్ధన్ ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏటీఎంల వద్ద తాకిడి పెరిగింది. ఇలాంటి సమయంలో సహజంగానే ఏటీఎంలలో ఒత్తిడి ఉంటుంది. అయితే, ఏటీఎంలు మాత్రం ఫుల్క్యాష్తో కళకళలాడుతున్నాయని నివేదికలు వస్తున్నాయి.
బ్యాంక్ సేవల్లో షరతుల నేపథ్యంలో చాలా మంది బ్యాంకులకు వెళ్లడానికి బదులు ఏటీఎంలపైనే ఆధారపడుతున్నాయి. అయినప్పటికీ సమస్యలు ఎదురవడం లేదంటున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయం నాటి పరిస్థితిని రానివ్వకుండా ఆర్బీఐ చాలా చర్యలు తీసుకుందని సమాచారం. ఇదివరకటి కంటే ఎక్కువ క్యాష్ను బ్యాంకులకు పంపింది. ఆర్థిక మంత్రిత్వశాఖ కూడా బ్యాంకుల వారీగా లెక్కలు తీసి తగిన ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా ఏటీఎంలో ఉండే మొత్తం కంటే మూడురెట్లు ఎక్కువగా క్యాష్ నింపుతున్నారు. బ్యాంకుల బ్రాంచుల్లోనూ నగదు కొరత లేకుండా మేనేజ్మెంట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
బ్యాంకుల వారీగా చూస్తే...పంజాబ్ నేషనల్ బ్యాంక్ సాధారణంగా తన ఏటీఎంలో ఉండే మొత్తం కంటే ఇప్పుడు మూడురెట్లు ఎక్కువ క్యాష్ ఉంచుతోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా 50 శాతం ఎక్కువ మొత్తాన్ని ఏటీఎంలలో నింపింది. తాము కూడా ఎక్కువ క్యాష్ను అందుబాటులో ఉంచామని చెప్పిన స్టేట్ బ్యాంక్ ఆఫీసర్లు, ఎంత మొత్తం అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు క్యాష్ సప్లై విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని, ఏటీఎంలలో తగినంత డబ్బు ఉందని ఏటీఎం ఆపరేటర్ ఒకరు మీడియాకు వెల్లడించారు.