ప్రాణాంతాక కరోనా మహమ్మారి పుట్టుకకు కేంద్రంగా ప్రపంచం చేసే నిందలు ఎదుర్కుంటున్న చైనాలోని వుహాన్లో పరిస్థితులు మారుతున్నాయి. వైరస్ కేంద్ర బిందువైన వుహాన్ నగరం రెండు నెలల లాక్డౌన్ తర్వాత ఇటీవలే మళ్లీ తెరుచుకుంది. వైరస్ వల్ల చనిపోయిన వారి చితాభస్మం కోసం కుటుంబ సభ్యులు స్మశానవాటికల వద్ద క్యూలైన్లు కట్టిన ఉదంతాలు ఆ సమయంలో కనిపించాయి. తాజాగా ఆ నగరంలో మరింతగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. చాలా కాలంపాటు మూతపడిన దుకాణాలు తెరుచుకోగా.. పాఠశాలలు ఇప్పడిప్పుడే మొదలవుతున్నాయి.
కరోనా కారణంగా హుబే ప్రావిన్స్లోని వుహాన్లో పాఠశాలలు జనవరి నెల నుంచి నిరవధికంగా మూతపడ్డాయి. వుహాన్లో బుధవారం నుంచి పాఠశాలలు తెరుచుకొంటాయని అధికారులు ప్రకటించగా.. గురువారం నాడు హైస్కూల్ విద్యార్థులు చాలా పలుచగా హాజరయ్యారు. పాత విద్యార్థులు మాత్రమే తరగతులకు వచ్చారు. తొలుత ప్లస్ టు విద్యార్థులకు, అనంతరం హైస్కూల్ విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు. విద్యార్థులు స్కూల్కు రాగానే వారికి శానిటైజర్ అందించి శరీర ఉష్ణోగ్రతలు కొలువడం, తరగతి గదుల్లో నిర్ణీత దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టడం, మధ్యాహ్న భోజనం పాఠశాలలే అందివ్వడం వంటి చర్యలు చేపట్టారు. పలువురు ప్లస్ టూ విద్యార్థులు యూనివర్సిటీ ఎంట్రెన్స్లకు ప్రిపేర్ అవుతుండటం కనిపించింది.
ఇదిలాఉండగా, దాదాపు కోటి పది లక్షల జనాభా ఉన్న వూహాన్.. జనవరి మొదటివారం నుంచి వార్తల్లోకెక్కింది. తొలి కరోనా వైరస్ నమోదుతో వూహాన్ నగరంపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేసింది. రోడ్లను బ్లాక్ చేశారు. నగరంలోకి ఇతర ప్రాంతాల వారు రాకుండా సరిహద్దులను మూసేశారు. చైనాతో పాటు మిగతా ప్రపంచ దేశాలతో వూహాన్కు సంబంధాలు లేకుండా చేశారు. ఎక్కడికక్కడ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటుచేసి వైద్యారోగ్య సిబ్బంది 24 గంటలపాటు సేవలందించారు. మొత్తానికి కరోనా వైరస్ను కట్టడి చేశారు.