దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఇప్పట్లో కరోనాను నియంత్రించడం సాధ్యమా...? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 
 
తాజాగా మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 9 నుండి రాష్ట్రంలో రెండు వారాల పూర్తి లాక్ డౌన్ ను విధించనుంది. ఈరోజు నుంచి మరో రెండు రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు కీలక ప్రకటన వెలువడింది. ముఖ్యమంత్రి జోరమ్ తంగా మంత్రులు, అధికారులతో చర్చలు జరిపి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిన్న ప్రకటన వెలువడింది. 
 
చిన్న రాష్ట్రమైన మిజోరాంలో దేశంలో కరోనా వేగంగా విజృంభించినా తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 24 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఎవరూ కరోనా భారీన పడి మృతి చెందలేదు. 11 లక్షల జనాభా ఉండే మిజోరాంలో కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 
 
ఇతర రాష్ట్రాల నుంచి మిజోరాంకు వచ్చిన ఐదుగురు వ్యక్తులకు తాజాగా కరోనా నిర్ధారణ అయింది. ఈ ఐదు కేసుల్లో నలుగురు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రాగా ఒకరు గుజరాత్ నుంచి వచ్చారు. కరోనా సోకిన ఐదుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలు దాటగా 7,135 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,24,905కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: