అమరావతి: ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మూడో రోజు కూడా విచారణ జరిగింది. ప్రభుత్వం ఈసీకి సహకరించడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు. ఎక్కడ సహకరించడం లేదో స్పష్టంగా చెప్పాలని హైకోర్టు సూచించింది. ఈసీకి రూ.40 లక్షలు రావాల్సి ఉందని, వాటిని విడుదల చేయడం లేదని నిమ్మగడ్డ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ తరపున న్యాయవాది ఇప్పటికే ప్రభుత్వం రూ.39 లక్షలను జమ చేసిందని గుర్తుచేశారు.
ఎన్నికల కమిషన్ లోని కొన్ని పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని నిమ్మగడ్డ ఆరోపించారు. అయితే పోస్టుల భర్తీ చేయడం లేదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడాన్ని కోర్టు ఎత్తిచూపింది. తన నివాసం వద్ద పనిచేసేందుకు అడిషనల్ అటెండర్ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు నిమ్మగడ్డ వివరించారు. హైదరాబాద్ లోని నిమ్మగడ్డ నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రకటించాలని వాదించారు.
దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న మీకు హైదరాబాద్ లో అధికారిక నివాసం ఎందుకు అని ప్రశ్నించింది. విజయవాడలో ఒక అధికారిక నివాసం హైదరాబాద్ లో మరో అధికారిక నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రజా ధనాన్ని వృధా చేయడం కాదా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు సమర్పించకుండా కోర్టు ముందుకు రావడంపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిధులు విడుదల చేసిన తరువాత కూడా విమర్శలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం సహకరించేలా చూడాలన్న నిమ్మగడ్డ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది...ఈ ఆర్టికల్ నచ్చితే like చేయండి