దేశంలో కరోనా రెండో వేవ్ వచ్చే అవకాశాలు ఉన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుంది. ప్రజల కోసం కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా సమావేశాలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా కోవిడ్‌ వాక్సిన్‌ పై ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా ఈ సమావేశంలో సిఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కోవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌ కు సంబంధించి వివిధ అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చ జరిపారు.

వ్యాకిన్‌ తయారీ, వ్యాక్సినేషన్‌ ముందుగా ఎవరికి ఇవ్వాలి? ప్రాధాన్యతలు, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, పంపిణీ సందర్భంలో అనుసరించాల్సిన పద్ధతులపై వీడియో కాన్ఫరెన్స్‌ లో చర్చ జరిగింది. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌  తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. వ్యాక్సిన్‌ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు? అందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలి? తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ ను నిల్వ చేయడం, అంతే కాకుండా అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు దాన్ని తరలించడం అన్నది రెండూ కూడా కీలక అంశాలని, దీనిపై కూడా మార్గదర్శక ప్రణాళిక ఉండాలని సీఎం జగన్ సూచనలు చేసారు. వ్యాక్సిన్‌ పంపిణీ సన్నద్ధతపైనా సరైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయా అంశాలపై సాంకేతిక సమాచారం సేకరించాలని, వివిధ కంపెనీల నుంచి కూడా సంబంధిత సమాచారం తీసుకుని అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. వ్యాక్సిన్‌ సంబంధిత అంశాలపై కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సిఎంల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: