ముంజేతి కంకణానికి అద్దమేలా అని ఒక సామెత ఉంది. అన్నీ తెలిసిన వారికి వేరొకరి సలహాలు సంప్రదింపులూ అవసరమా. కానీ రాజకీయాలు మారుతున్నాయి. ఒక బుర్రకు మరో బుర్ర తోడు అయితే బ్రహాండమైన ఫలితాలు వస్తాయని ఆశలు పెరిగిపోతున్నాయి. అవి ఒక్కోసారి హిట్టూ అవవచ్చు. లేక ఫట్టు కూడా అవవచ్చు.

తెలుగు రాజకీయాల్లోకి వ్యూహకర్తల కల్చర్ ని తెచ్చింది అచ్చంగా వైసీపీనే. ఆ పార్టీ ప్రశాంత్ కిషోర్ ని తీసుకు వచ్చి తమ పార్టీని అధికారం పీఠం మీద కూర్చోబెట్టుకుంది. పీకే వ్యూహాలు. ఎత్తుగడలకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు బోల్తా కొట్టారు. దాంతో కేవలం 23 సీట్లకే టీడీపీ 2019 ఎన్నికల్లో దిజరాగి దారుణమైన ఓటమిని చవి చూసింది.

ఇక ఆనాడు పీకేని వైసీపీ నియమించుకున్నపుడు మాకు చంద్రబాబు లాంటి గండర గండడు ఉండగా వేరే వ్యూహకర్తలు అవసరం లేదు అంటూ టీడీపీ ఎకసెక్కం ఆడింది. సీన్ కట్ చేస్తే ఇపుడు టీడీపీ కూడా ఒక వ్యూహకర్తను నియమించుకుంది. ఆయనే రాబిన్ శర్మట. ఆయన పీకే టీం లో పనిచేసిన అతి ముఖ్య సభ్యుడు. ఆయన సేవలు అందుకున్న టీడీపీ దాని ప్రకారం కొన్నాళ్ళుగా హిందూత్వ రాగాలు ఆలపిస్తోందంటున్నారు.

అయితే అది మరీ శృతి మించి రాగాన పడిందని అంటున్నారు. రామతీర్ధానికి చంద్రబాబు టూర్ చేయడం వెనక రాబిన్ శర్మ వ్యూహం ఉందని చెబుతున్నారు. అలాగే మతం కార్డుతో జగన్ కి కొడితే ఏపీలో టీడీపీ పుంజుకుంటుందన్న సలహాలు కూడా పీకే శిష్యుడి సలహాలుగా చెబుతున్నారు.  అయితే అదిపుడు వికటించిందని బలమైన లౌకిక ముద్ర ఉన్న టీడీపీ మీద ఇపుడు మైనారిటీలు గుర్రుమంటున్నారని వార్తలు వస్తున్నాయి.

క్రిస్టియన్లు అయితే అసంతృప్తితో ఉంటే ఒక మాజీ ఎమ్మెల్సీ సహా  కొందరు నాయకులు బయటకు వెళ్ళారు. మరో వైపు  ముస్లిం మైనారిటీ నాయకులు కూడా టీడీపీ తాజా పోకడల పట్ల గుస్సాగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ ఎన్నడూ చూడని ఇబ్బందులో పడుతోంది అంటున్నారు. మరి ఇది పీకే శిష్యుడి వ్యూహంగా చెబుతున్నారు. అదే కనుక నిజమైతే మాత్రం వెంటనే ఆ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉందని పార్టీ హితైషులు సూచిస్తున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: