ఎవ్వరూ చేయలేని రీతిలో విద్యార్థుల పోషకాహారం కోసం గోరుముద్దను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అలాగే ఆరోగ్యకరమైన పరిస్థితులను స్కూళ్లలో తీసుకు రావడానికి టాయిలెట్ ఫండ్ను ఏర్పాటు చేసి... వాటిని పరిశుభ్రంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రానున్న కాలంలో వీటి నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలన్నారు. టాయిలెట్ల క్లీనింగులో వాడే రసాయనాల వినియోగంపై కూడా కేర్టేకర్లకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ చెప్పారు. టాయిలెట్ను ఒకసారి వినియోగించిన తర్వాత కచ్చితంగా క్లీన్ చేయాలన్నారు. విద్యార్థులకు టాయిలెట్ల నిర్వహణలో సులభ్ లాంటి సంస్థల అనుభవాన్ని, వారి నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
ప్రతిరోజు విద్యార్థుల హాజరు యాప్లో నమోదు చేయాలని సీఎం జగన్ తెలిపారు. దీంతో నేరుగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో హాజరు విషయాలను యాప్లో నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలు స్కూల్కు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లాలని సీఎం చెప్పారు. పిల్లలు స్కూళ్లకు రాని పక్షంలో వాలంటీర్తో యోగక్షేమాలు కనుక్కోవాలని సీఎం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్ దీనిపై పర్యవేక్షణ చేయాలని సీఎం చెప్పారు. ఫిబ్రవరి ప్రథమార్థంలో అన్ని తరగతులకూ స్కూళ్లు తెరిచే విషయమై ఒక ఆలోచన చేయాలని సీఎం వివరించారు. రోజువారీ తరగతుల నిర్వహణపై కూడా ఆలోచన చేయాలన్నారు. దీనిపై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ చెప్పారు.
విద్యాకానుకకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సకాలంలో విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తప్పనిసరిగా విద్యాకానుక అందించాలని సీఎం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏడోతరగతి వారికి ఇంగ్లిషు మాధ్యమంలో బోధనపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.