జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణం కోసం వాలంటీర్ ఇంటి వద్దకు వచ్చి ప్రభుత్వం కల్పించిన మూడు అంశాలలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని ఇల్లు కట్టుకోవచ్చని మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ముడిసరకు కావాలంటే ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, లేదా మేము పెట్టుకోలేము ప్రభుత్వమే కట్టి ఇవ్వాలని అడిగినా.. ప్రభుత్వమే ఇంటి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ఎంతో పారదర్శకంగా ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలోనే వారికి ఇంటి పట్టాలు అందజేస్తున్నామని తెలియజేశారు.
ఇంటి పట్టాల తో పాటు 1.11 లక్షల మందికి ఇంటి నిర్మాణానికి సంబంధించి మంజూరు ఇచ్చామని, మిగతా ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మంజూరు చేస్తామని మంత్రి సత్యన్నారాయణ చెప్పారు. ప్రజలంతా ఒకే కులం, మతం, వర్గం అని, అందరూ కలిసి ఉండాలని లాటరీ తీసి ఇంటిగ్రేటెడ్ కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సామాన్యులకు మంచి జరగాలని తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉంటే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాతో పాటు సరిహద్దులు తెలియజేసి, అధికారుల సంతకం, పూర్తి వివరాలు, డి ఫారం పట్టా ఇస్తున్నామని, త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మంత్రి బొత్స సత్యన్నారాయణ స్పష్టం చేశారు.