మరి భార్య పార్టీ పెడితే సహజంగానే బ్రదర్ అనిల్ కుమార్.. ఆమెకు అనుకూలంగా తన పలుకుబడి ఉపయోగించి క్రైస్తవ వర్గాలను ప్రభావితం చేస్తారు కదా.. మరి తెలంగాణ క్రైస్తవులు షర్మిల వైపు తిరిగితే.. అది ఏపీలోనూ ప్రభావితం చూపిస్తుంది కదా.. అంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. తన తాజా కొత్త పలుకులో రాధాకృష్ణ ఇదే విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత భారీ స్థాయిలో కాకపోయినా తెలంగాణలోనూ ఇటీవలి కాలంలో మత మార్పిడులు పెరిగాయని... షర్మిల భర్త అనిల్ కుమార్ స్వయంగా క్రైస్తవ మత ప్రచారకుడు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లోని క్రైస్తవ మత ప్రచారకుల్లో ఆయనకు మంచి పట్టు ఉందని ఆర్కే అంటున్నారు.
బ్రదర్ అనిల్ సారథ్యంలో జరిగిన ప్రచారంవల్లనే ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవులు అందరూ మూకుమ్మడిగా జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచారని... ఇప్పుడు షర్మిల తన సోదరుడితో విభేదించి సొంత పార్టీ ప్రారంభిస్తే క్రైస్తవులు ఎటువైపు ఉంటారన్నది చర్చనీయాంశమవుతుందంటున్నారు ఆర్కే. తెలంగాణలోని క్రైస్తవులు షర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని... అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులలో అత్యధికులు రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో తనకే మద్దతిస్తారని షర్మిల అంచనా వేసుకుంటున్నారట... మరి ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందట. రాజశేఖర్ రెడ్డిపై ప్రజలలో ఉన్న అభిమానం, విశ్వసనీయతే పెట్టుబడిగా షర్మిల రాజకీయ అరంగేట్రం చేస్తున్నారట .
మరి ఇందులో వాస్తవం ఎంత.. షర్మిల నిజంగా పార్టీ పెడతారా.. ఇది తేలాలంటే ఫిబ్రవరి 9 వరకూ ఆగాలి.. ఎందుకంటే.. షర్మిల ఫిబ్రవరి 9 న పార్టీ పెడతారని ఆర్కే చెబుతున్నారు.