ఈ వివరాలను ఏజింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్: యాన్ ఎమర్జింగ్ గ్లోబల్ రిస్క్ పేరుతో ఐక్యరాజ్యసమితి రూపొందించింది. భారత్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జపాన్ వంటి దేశాల్లో డ్యామ్ల స్థితిగతులపై అధ్యయనం జరిపి ఈ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం భారత్లో దాదాపు 1000 డ్యామ్లు మరో నాలుగేళ్లలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాయట. అందువల్ల వాటి ఆనకట్టులు ఏ సమయంలో బ్రేక్ అవ్వొచ్చని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది.
ఉదాహరణకు.. కేరళలో 100 ఏళ్ల కిందట నిర్మించిన ముళ్లైపెరియార్ డ్యామ్కు ప్రమాదం వాటిల్లితే 35 లక్షల మందికి ప్రమాదం కలుగుతుందట. మరి దాదాపు 1000 డ్యామ్లకు ప్రమాదం వాటిల్లితే ఇంకేమైనా ఉందా... అందుకే ఈ డ్యామ్లపై దృష్టి సారించాలని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ఐక్యరాజ్య సమితి ఇంకా ఏం చెబుతోందంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 58,700 భారీ డ్యామ్లలో అధిక భాగం 1930-1970 మధ్య నిర్మించినవేనట. 50 ఏళ్లు నిండాక ఒక భారీ కాంక్రీటు డ్యామ్లో సమస్యలు మొదలవుతాయట.
అంతే కాదు.. 50 ఏళ్లు దాటితే.. జలాశయాల మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు పెరుగుతాయట. సమర్థత తగ్గిపోతుందట. ప్రపంచంలోని భారీ డ్యామ్లలో సగానికిపైగా అంటే 32,716 డ్యామ్లు ఆసియాలోని చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాలోనే ఉన్నాయట. భారత్లో 2025 నాటికి 50 ఏళ్లు పూర్తిచేసుకునే భారీ డ్యామ్లు 1,115 మేర ఉంటాయట. 2050 నాటికి వాటి సంఖ్య 4250కు చేరుతుందట. అందుకే ఐక్యరాజ్య సమితి ఈ వార్నింగ్ ఇచ్చింది.