శ్రీకాకుళం.. ఈ జిల్లా సాధారణంగా ప్రశాంతతకు మారుపేరుగా ఉంటుంది. అలాంటి చోట.. ఎన్నికలు చిచ్చురేపుతున్నాయి. ఇటీవలే పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి.. అయితే అలాగని పార్టీల నేతలు ఊపిరిపీల్చుకునే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయతీ సమరం ముగిసినా.. ఆ వెనుకే.. ఇతర ఎన్నికలూ వరుసలో ఉన్నాయి. వచ్చే నెలలో మున్సిపల్ సమరం జరగబోతోంది. మరి పంచాయతీ సంగ్రామంలో హోరాహోరీ పోరు సాగింది. ఇక పురపాలికలకు ఎలా ఉంటుందో అన్న ఆలోచన నేతల్లో కనిపిస్తోంది.

శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో జరిగేవి. జిల్లాలో గొడవల ఊసే ఉండేది కాదు. కానీ ఈ పంచాయతీ పోరు కొత్త గొడవలు తెచ్చింది. అందుకే పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఇంకా కొన్ని పల్లెలు అట్టుడికి పోతున్నాయి. సాధారణ గొడవలకు రాజకీయ రంగు పులిమి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న జిల్లాలో కొట్లాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

ఎన్నికలు ముగిసిన తర్వాత సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, రేగిడి, పొందూరు, రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సంతబొమ్మాళి మండలం భావనపాడు పంచాయతీలో ఎన్నికల తర్వాత  కొత్తపేట, మజ్జిపేట గ్రామాల్లోని పలువురు ఇళ్లపై దాడులు జరిగాయి. కోటబొమ్మాళి మండలం బలరాంపురంలోనూ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి. అటు రేగిడి మండలం కొండవలస పంచాయతీలో కొంతమంది బ్యాలెట్‌ పెట్టెలను అపహరించుకుపోయారు ఈ ఘటనకు సంబంధించి 34 మందిపై కేసులు పోలీసులు నమోదు చేశారు.

ఇక పొందూరు మండలం కింతలి పంచాయతీ కాజీపేట గ్రామంలో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవడంతో ద్విచక్రవాహనాలతో పాటు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆరుగురుకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. జిల్లాలో ఎన్నో గోడవలు.. మరి ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అన్న ఆందోళన కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: