ఆకాశం నుంచి దిగిరానంటున్న నిత్యావసరాల ధరలు, అలవికాని రీతిలో పెరుగుతున్న ఆస్తి పన్ను, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుందో కాగడా పెట్టి వెదికినా కానరాని వైనం, రాజధాని తరలింపు, రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలు.. వెరసి అధికారపార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం ప్రమాదమని తెలుసు. అయినా వెళ్లి గెలవాలంటే ఏం ఏయాలి.. జనబలం లేనప్పుడు ధనబలాన్ని నమ్ముకోవాలి. ఏపీలో అధికార పార్టీ ఇప్పుడు ఇదే సూత్రాన్ని అమలు చేస్తోంది.
కృష్ణా జిల్లా పురపాలక సంఘాల ఎన్నికల్లో గెలుపు సొంతం చేసుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రలోభాలకు తెరదీశారు. అభ్యర్థులతో బేరాలు మొదలుపెట్టారు. నామినేషన్ ఉపసంహరించుకుంటే భారీ మొత్తాలను ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఫలితంగా నూజివీడు మున్సిపాలిటీలో 30వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్ను ఉపసంహరించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉయ్యూరు నగర పంచాయతీలో 15వ వార్డు టీడీపీ అభ్యర్థిదీ అదే పరిస్థితి. తిరువూరు, మచిలీపట్నంల్లోనూ ప్రలోభాలపర్వం జోరుగా నడుస్తోంది.
మచిలీపట్నంలో ఓ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మంత్రి సన్నిహితుడి నుంచి ఫోన్ వచ్చింది. నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ.10 లక్షలు ఇస్తామని, దాంతోపాటు కార్పొరేషన్లో పనులు కూడా ఇప్పిస్తామన్నారు. తమ మాట వినాలని, లేదంటే తర్వాత ఇబ్బంది పడటమెందుకని సుతిమెత్తగా హెచ్చరించారు. విజయవాడ నగరపరిధిలోని ఓ డివిజన్లో టీడీపీ అభ్యర్థికి నామినేషన్ ఉపసంహరించుకుంటే రూ.20లక్షలు ఇస్తామని అధికారపక్షం నాయకులు ఆశ చూపారు. తొలుత అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా నామినేషన్లు ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులు ఆ ప్రయత్నం ఫలించకపోతే బెదిరింపులకు సైతం వెనకాడటం లేదు. ఒకవేళ మీరు కార్పొరేటర్గా గెలిచినా ఆ ఆనందం లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. అప్పటికీ వినకపోతే అభ్యర్థి కులాన్ని బట్టి ఆయా కుల సంఘాల నాయకులతో అధికార పార్టీ నాయకులు మాట్లాడిస్తున్నారు.