ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయవ్యవస్థకు రాజధానిగా అలాగే విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా నియమించాలని చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ అయినప్పటికీ పెద్దల సభలో టీడీపీకి సభా బలమున్నందున బిల్లును ఆపగలిగారు. అయితే ప్రజలకు టీడీపీ చెబుతున్న ప్రకారం హై కోర్టు, అసెంబ్లీ మరియు అడ్మినిస్ట్రేషన్ ఒక దగ్గర ఉంటేనే రాజధాని అభివృద్ధి అవుతుంది. ఒక్కో విభాగం ఒక్కో దగ్గర ఉంటే ఎలా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
అయితే అమరావతికి మొత్తం నిధులు పెట్టి అభివృద్ధి చేసినా అక్కడ ఉన్న 19 గ్రామాలు మాత్రమే బాగుపడతాయి. పైగా ఇది ఇప్పటికిప్పుడు జరిగే విషయం కూడా కాదు. అదే ఆ నిధులలో కొంచెం మూడు దగ్గర్లా వాడినా ఎంతో కొంత మూడు ప్రాంతాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. కాగా నిన్న కర్నూలు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును అక్కడి న్యాయవాదులు ఈ విషయం గురించి నిలదీయడం జరిగింది. బాబు గారు మేము ఎప్పుడు చెప్పాము మాకు హై కోర్ట్ కర్నూలు లో వద్దని, మీరెందుకు మా తరపున వకాల్తా పుచ్చుకున్నారు అని, దీనితో చంద్రబాబుకి పరువు పోయినంత పనయింది. దీని నుండి తప్పించుకోవడానికి ఎప్పటిలాగే జగన్ మీద ఘాటుగా స్పందించి పరారయ్యారు. ఇందుకే ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలంటే అది వారికి మంచి జరిగేలా ఉండాలి లేదంటే ఏమీ మాట్లాడకుండా ఉండాలి.