ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఆలస్యం పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నేటివరకు అతికొద్దిమంది ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రమే పెన్షన్స్ అందాయి అని అన్నారు.

మార్చి 5వ తేదీ వచ్చినా ఫిబ్రవరి నెల పింఛన్లు నేటికీ అందకపోవడం ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది అని విమర్శించారు. పదవీ విరమణ అనంతరం ప్రయోజనాలైన జీపీఎఫ్, గ్రాట్యూటీ, కమ్యుటేషన్, ఎర్డ్న్ లీవ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి ప్రయోజనాలు నేటికీ అందలేదు అని అన్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు  సైతం ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నదని జీపీఎఫ్ లోన్ అడ్వాన్స్ లు, ప్రయోజనాలు కూడా నెలల తరబడి మంజూరు చేయడంలేదు అని ఆరోపించారు.

ఆర్థిక శాఖలో 2020 సెప్టెంబర్ 30వతేదీ నుంచి నేటివరకు సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి అని పేర్కొన్నారు. ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురవుతున్నారు అని ఆయన అన్నారు. సీఎస్ తక్షణమే జోక్యం చేసుకుని నేటివరకు బకాయిపడిన పెండింగ్ బిల్లుల మొత్తాన్ని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. బకాయిలను ప్రభుత్వ విధానాల మేరకు వారు జారీ చేసిన జీవో 100 మేరకు 4 1/2 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి అని డిమాండ్ చేసారు. ఉద్యోగుల జీతభత్యాలకు ఈఎస్ఆర్ లో సర్వీస్ వివరాల నమోదుకు ముడిపెడుతూ జీతభత్యాలను ఆలస్యం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. గత నెల 18వ తేదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన ఉద్యోగ సంఘాల చర్చలలో ఈ విషయాన్ని ప్రస్తావించామన్నారు. కానీ నేటికీ ఈ అంశం ప్రభుత్వం నుండి స్పందన లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: