నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. బైపోల్ అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో చివరి నిమిషం వరకు ప్రచారం హోరెత్తింది. రాష్ట్ర నేతలంతా సాగర్ లో మకాం వేశారు. అయితే పోలింగ్ కు కొన్ని గంటల ముందు సాగర్ కు ఎన్నికకు సంబంధించి సంచలన విషయం వెలుగులోనికి వచ్చింది.

నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి పోటీ చేయడమే ఇష్టం లేదని, అధిష్టానమే బలవంతంగా బరిలో నిలిపిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా.. జానా రెడ్డిపై ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధించుకున్నామనే సంతోషమే వారికి లేదని, కేవలం అధికారం పోయిందనే ఆతృతే ఉందన్నారు. కులాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని చెప్పారు. ఇది కాగ్రెస్ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనమని గుత్తా విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవికోసం జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి హనుమంతురావు, శబ్బీర్ అలీ, బట్టి విక్రమార్క వంటి నాయకులు కొట్లాడుతున్నారని, వారి కల్లబొల్లి మాటలు సాగర్ ప్రజలు నమ్మొద్దని చెప్పారు. సాగర్ ప్రజలు విజ్ఞత తో ఉన్నారని, తెలంగాణలో జానాకు సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు.కాంగ్రెస్ సో కాల్డ్ లీడర్లు ఎప్పుడూ తెలంగాణ కోసం కొట్లాడలేదని, వారంత కేసీఆర్ పార్టీని విలీనం చేస్తామన్నా వ్యతిరేకించారని ఆరోపించారు.

నోముల నర్సింహయ్య అసెంబ్లీలో కొట్లాడి సాగర్ ను అభివృద్ధి చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. జానారెడ్డికి ఇద్దరు కుమారులతో తల నొప్పిగా మారిందని, ఆయన పేరును బద్‌నాం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి టీడీపీని ముంచి కాంగ్రెస్ లో చేరారని, భజన బ్యాచ్ ను వెంట తెచ్చుకుని సాగర్ లో డ్రామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు సాగర్ ప్రజలు నమ్మవద్దని, శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్న తనపై విమర్శలు సంధించడం సరికాదన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని నాగార్జున సాగర్ నియోజక వర్గ ప్రజలు బలపరచాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: