ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాల నుంచి కూడా మత్స్యకారులు ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు. ఇక ఇప్పుడు వరుసగా మూడో ఏడాది కూడా మత్స్యకారుల అందరికీ వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం లో భాగంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. హామీ ఇచ్చిన విధంగానే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అండగా నిలిచేందుకు మరోసారి సిద్ధమైంది. ఇందులో భాగంగా 1,19,875 కుటుంబాలకు రూ.130.46 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2019లో మొదటిసారి వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం లో భాగంగా మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించింది. 2019లో 1.02 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.102 కోట్లు అందించింది ప్రభుత్వం.. 2020లో 1.09 లక్షల కుటుంబాలకు రూ.109 కోట్లు సాయం చేసింది. ఈ ఏడాది మొత్తం 1,19,875 మందిని అర్హులుగా తేల్చగా.. ఇందులో బీసీలు 1,18,119 మంది, ఓసీలు 747 మంది, ఎస్సీలు 678 మంది, ఎస్టీలు 331 మంది ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకం చేరే విధంగా చర్యలు కూడా చేపడుతుంది ఏపీ ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇంకా అర్హులెవరైనా ఉన్నారేమోనని ప్రభుత్వం గుర్తిస్తోంది. ఈ నెల 18న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.