సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన దృష్ట్యా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభ ఏర్పాట్లను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ....రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌న్నారు. ఉదయం 11 గంటలకు తొలుత సిద్దిపేట పట్టణంలో నూతనం గా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తార‌ని చెప్పారు. అనంతరం సిద్దిపేట శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తార‌ని చెప్పారు. ఆ వెంటనే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల‌ ప్రారంభోత్సవం ఉంటుంద‌న్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన‌ అనంతరం ప్ర‌జాప్ర‌థినిదులు అధికారుల‌తో సమావేశం ఉంటుందని చెప్పారు. 

తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటుతో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరిగిందన్నారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని 7 ఏండ్లలో చేశామ‌ని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దేశానికి దశ , దిశా ఇచ్చేలా అన్ని కొత్త జిల్లాలలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించామని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణం జ‌రిగింద‌న్నారు. అధునాతన సాంకేతిక తో ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణం చేపట్టామ‌ని తెలిపారు.

ప్రజల చెంతకే పాలన తెచ్చేలా, పరి పాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల తో పాటు కొత్త డివిజన్ లు, మండలాలు, మున్సిపాలిటీ లను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. కొత్త జిల్లాల్లో అభివృద్ధి చిహ్నాలుగా కొత్త ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయ‌ని అన్నారు. సిద్దిపేట ప్రాంత దశాబ్దాల జిల్లా ఆకాంక్ష ను కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ఏర్పాటు తో మూడు జిల్లాలకు ప్రయోజనం కలిగిందని, ప్రజలకు దూర భారం తగ్గిందని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి సీఎం కేసీఆర్ మొద‌ట‌ ప్రారంభోత్సవం చేయడం జిల్లా ప్రజల అదృష్టమ‌ని హ‌రీష్ రావు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: