రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు మీద వేటు పడుతుందా అంటే అవును అనే సమాధానం వస్తోంది. జగన్ రాజుని మాజీ ఎంపీగానే చూస్తాను అంటున్నారు. ఆయన అంతలా పట్టుపట్టేశారు. ఈ విషయంలో ఆయన ఏకంగా బీజేపీ పెద్దలతోనే ఢీ కొడుతున్నారు. దాంతో ఇన్నాళ్ళూ రాజుని రక్షించేందుకు ప్రయత్నాలు చేసిన వారు కూడా ఇపుడు సైలెంట్ అయ్యారు. తనకు ఎలాంటి నోటీసులు రావు అని అనుకున్న రాజుకు షాక్ ఇచ్చేలా లోక్ సభ స్పీకర్ సెక్రటేరియట్ నుంచి ఆయనకు తాజాగా  నోటీసులు వచ్చాయి. వైసీపీ అనర్హత పిటిషన్ మీద సమాధానం చెప్పాలని కూడా అందులో పేర్కొన్నారు.

దీంతో షాక్ తినడం రాజు వంతు అయింది. ఇక రాజు మీద వేటు పడడానికి కారణం దేశంలో మారిన రాజకీయ పరిస్థితులే అంటున్నారు. మోడీ గ్రాఫ్ ఒక వైపు తగ్గిపోవడం, మరో వైపు చూస్తే నమ్మకమైన మిత్రులు కూడా లేకపోవడంతో బీజేపీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఈ నేపధ్యంలో వైసీపీని కూడా దూరం చేసుకొవడం ఇష్టం లేకనే రాజు మీద వేటుకు సిద్ధపడుతోందని అంటున్నారు. ఈ నెలాఖరులోగా రాజు తన సమాధానం ఇచ్చినా అది లాంచనమే అని అంటున్నారు.

జగన్ బెయిల్ రద్దు అవుతుందో లేదో తెలియదు కానీ రాజు మీద అనర్హత వేటు పడడం మాత్రం ఖాయమని ఇప్పటికే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పేశారు. రాజు విషయంలో ఏనాడో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సింది అని కూడా ఆయన అంటున్నారు. ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు కాబట్టి వేటు వేయడంలో తప్పు లేదని కూడా నారాయణ వంటి వారు చెప్పడం బట్టి చూస్తూంటే ఢిల్లీలో ఏదో జరుగుతోంది అన్న భావన మాత్రం అందరిలో ఉంది.  మొత్తానికి రెబెల్ రాజు మీద వటు పడితే మాత్రం నర్సాపురం లోక్ సభ సీటుకు ఉప ఎన్నికలు జరగడం అనివార్యమే.


మరింత సమాచారం తెలుసుకోండి: