నిరుద్యోగులకు అండగా నిలిచి వారిలో భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారం వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగుల నిరాహార దీక్ష చేపట్టింది. ప్రతివారం ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను పరామర్శించి వారితో కలిసి దీక్ష చేస్తోంది. అయితే కొన్ని జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల నుంచి చేదు అనుభవం ఎదురు కావడంతో పరామర్శ లకు ఫుల్ స్టాప్  పెట్టింది. కేవలం జిల్లా కేంద్రంలో దీక్షలు చేపట్టేందుకే మొగ్గుచూపుతోంది. దీక్షలకు సైతం ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రాకపోవడంతో పార్టీ శ్రేణులు కొంత నైరాశ్యంలో ఉన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించుకొని దీక్షకు జూలై 13న వనపర్తి జిల్లా తాడిపత్రి నుంచి షర్మిల శ్రీకారం చుట్టారు. ప్రజా క్షేత్రంలో పర్యటించడంతో సామాన్యుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు ఆమె మరింత చేరువయ్యేలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

అందులో భాగంగా ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై ఆమె దృష్టి సారించగా నిరుద్యోగుల నుంచి స్పందన కరువైంది. దీక్షకు కేవలం పార్టీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు మాత్రమే హాజరు అవుతున్నారు. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది. దీనికితోడు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో బాధిత కుటుంబానికి పరామర్శ వెళితే తాళం వేయడం, మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ అమరుల కుటుంబ పరామర్శకు వెళితే వారు రావద్దని సూచించారు. నేడు భూపాలపల్లి జిల్లాలో నిరుద్యోగ కుటుంబాన్ని పరామర్శించాలని భావించినప్పటికీ అక్కడ కూడా వారు ఇంటికి రావద్దని సూచించారు. కొంతమందిని షర్మిల పరామర్శించినప్పటికీ దీక్షలో ఆ కుటుంబ సభ్యులు కూర్చోలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, నిరుద్యోగుల పై అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టి ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకోవాలని భావించిన షర్మిల కు మిశ్రమ స్పందనే వస్తోంది.

నిరుద్యోగులు సైతం రాకపోవడంతో దీక్షలు కేవలం పార్టీ దీక్షలు గానే మారుతున్నాయనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబ సభ్యులు సైతం సహకరించకపోవడంతో ఇక నుంచి కేవలం జిల్లా కేంద్రాల్లోనే దీక్షలు  చేయాలని పార్టీ అధినేత్రి షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 8 వారాలుగా దీక్షలు చేపడుతున్నా అందులో సగం మేరకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు తమను పరామర్శించోద్దని,ఇంటికి రావద్దని, ఒకవేళ వస్తే ఇంటికి తాళం వేసి వెళ్దామని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. దీంతో పరామర్శలు వద్దని భావించిన షర్మిల మునుముందు కేవలం దీక్షలను చేపట్టేందుకు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: