తన తండ్రిబాటలోనే షర్మిల 2012లో దాదాపుగా 230 రోజులు 116 నియోజకవర్గాలలో 3112 కీమీ పాదయాత్ర చేపట్టారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో మరోసారి ఆమె పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. చేవెళ్ల నుంచి ఆరంభించనున్న ఈ పాదయాత్రలో ఆమె 4వేల కిలోమీటర్లు నడిచి మరల చేవెళ్లలోనే ముగింపజేయనున్నారు. ఈ సంవత్సరం జులైన నెలలోనే ఆవిర్భవ సభలో పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం తప్ప మిగతా 16 పార్లమెంట్ స్థానాలన్నింటిని చుట్టే విధంగా నలుమూలాల తిరిగేటట్టు ప్రణాళిక రూపొందించారు. వైఎస్సార్టీపీ మొదటి రోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు ఆర్.కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ, కంచె ఐలయ్య తదితర నాయకులను ఆహ్వానించింది. తొలి 10 రోజుల పాటు చేవెళ్ల, భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో పాదయాత్ర కొనసాగనుంది.
పాదయాత్రలో తొలుత చేవెళ్ల-వికారాబాద్ రోడ్డు వద్ద ఉన్న కేజీఆర్ గార్డెన్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నిజిల్లాలకు చెందిన కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు పార్టీ శ్రేణులు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో షర్మిల ప్రసంగం కొనసాగనుంది. అది ముగిసిన తరువాత 11.30 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు వైఎస్ విజయమ్మ. షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించి తొలిరోజు సాయంత్రం వరకు కందవాడ-నక్కలపల్లి శివారుకు చేరుకోనున్నారు. ఈరోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. రోజుకు 12 కీలోమీటర్ల చొప్పున షెడ్యూలు రూపొందించారు. ఈ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగుతుందో ఇక వేచి చూడాలి.