ఎప్పుడైతే  కరోనా మహమ్మారి  వచ్చిందో  అప్పటి నుంచి హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో దాదాపు అన్ని రకాల కార్యకలాపాలు స్థంభించిపోయాయి. వ్యాపారాల నుంచి విద్యా సంస్థలు, కార్యాలయాల వరకు అన్ని రకాల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీని  ప్రభావం ఆర్టీసీపై కూడా పడిన‌ది.  హైదరాబాద్‌ నగరంలో ముఖ్యంగా సిటీ బస్సులను పరిమితం చేశారు. విద్యా సంస్థలు మూతపడడం, ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితం కావడంతో సిటీ బస్సుల సంఖ్యను పూర్తిగా తగ్గించారు. సిటీ బస్సులను ఎక్కువగా వినియోగించుకునేది  ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. నగర శివారు ప్రాంతాల్లో ఉండే  క‌ళాశాల‌ల‌కు పెద్ద ఎత్తున సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. కరోనా కారణంగా విద్యా సంస్థలన్నీ మూతపడడంతో ఈ సర్వీసులు  ఆగిపోయాయి.

 తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు ట్రిప్పులను పెంచినట్టు హైదరాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న వెల్ల‌డించారు. ముఖ్యంగా ఇబ్రాహీంప‌ట్న‌, ఘ‌ట్‌కేస‌ర్‌, కీసర, చేవెళ్ల, మొయినాబాద్, గండిమైసమ్మ, అబ్దుల్లాపూర్‌మెట్  ప్రాంతాల్లో  ఇంజ‌నీరింగ్ విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నారు.  దాదాపు నగరంలోని అన్ని వైపుల బస్సు సర్వీసులను పెంచనున్నట్టు వెంకన్న వివ‌రించారు.

ఇప్పటికే గండిమైస‌మ్మ‌, కీస‌ర‌, బాచుప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చ‌ల్ వంటి త‌దిత‌ర ప్రాంతాల‌లోని విద్యాసంస్థ‌ల‌కు రాక‌పోక‌లు కొన‌సాగించేందుకు వీలుగా అద‌న‌పు ట్రిప్పుల‌ను పెంచేందుకు అధికారులు క‌స‌రత్తు చేప‌ట్ట‌డం మొద‌లు పెట్టారు. అదేవిధంగా ఇబ్రాహీంప‌ట్నం, హ‌య‌త్‌న‌గ‌ర్‌,  రామోజీఫిలింసిటీ, ఘ‌ట్ కేస‌ర్‌, చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌లో ఉన్న క‌ళాశాల‌ల‌కు రాక‌పోక‌ల‌కు సాగించేందుకు విద్యార్థుల కోసం ఉప్ప‌ల్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, కోఠి, ఎల్బీన‌గ‌ర్ ప్రాంతాల నుంచి అద‌న‌పు బ‌స్సుల‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు హైదరాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న చెప్పారు. ప‌లువురు విద్యార్థులు క‌ళాశాల‌లు ప్రారంభం అయ్యాయని, బ‌స్సుల‌ను క‌ళాశాల‌ల స‌మ‌యానికి అందుబాటులో ఉంచాల‌ని డిపో హ‌య‌త్ న‌గ‌ర్, ఇబ్రాహీంపట్నం, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, ఉప్ప‌ల్ ప్రాంతాల మేనేజ‌ర్ల దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచ‌డం కోసం అద‌న‌పు ట్రిప్పుల‌ను పెంచుతున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: