ఐఏఎస్ క్యాడర్ నిబంధనల సవరణను తీవ్రంగా నిరసిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ప్రధాని నరేంద్రమోడీకి ఘాటుగా లేఖ రాసారు. అందులో ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్రం చేపట్టిన ఆలిండియా సర్వీసెస్ రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం.
ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల పని తీరును.. వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసే విధంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణలను వ్యతిరేకిస్తుంది. ఆయా రాష్ట్రాలలోనే ఆలిండియా సర్వీసెస్ అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేనిదే బదిలీపై కేంద్రం తీసుకురావడం ద్వారా రాష్ట్రాల పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాజ్యాంగ స్వరూపానికి సహకార సమాఖ్య స్పూర్తికి గొడ్డలి పెట్టు వంటిది.
ఈ సవరణల ద్వారా రాష్ట్రాలకు గుర్తింపు లేకుండా పోవడం.. నామమాత్రపు వ్యవస్థలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఈ ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల్లో అధికారులపై పరోక్ష నియంత్రణపై అమలు చేసే ఎత్తుగడ ఈ ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల్లో పని చేసే అధికారులపై పరోక్ష నియంత్రణను అమలు చేసే ఎత్తుగడ. కేంద్ర ప్రభుత్వ అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకోవడానికే ఈ సవరణ. రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కేంద్రం తలదూర్చడమే అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఏఐఎస్ అధికారులను బాధ్యులుగా.. జవాబుదారులుగా చేయాల్సింది పోయి వారిని మరింత నిరుత్సాహానికి గురి చేయడం, కేంద్రం చేత వేధింపుల దిశగా సవరణ ఉసిగొలుపుతుంది.
ఈ విధానం ఏఐఎస్ అధికారుల ముందు రాష్ట్రాలను నిస్సహాయులుగా నిలబెడుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 లోని నిబంధనల ప్రకారం.. ఆలిండియా సర్వీసెస్ 1951 చట్టాన్ని పార్లమెంట్ చేసిందని.. దాని ప్రకారం.. భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించిందని నేను అంగీకరిస్తున్నాను. కానీ రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా ఏఐఎస్ క్యాడర్ రూల్స్ కు రంగులద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
ఏఐఎస్ క్యాడర్ రూల్స్ 1954 సవరణ ఎంత మాత్రం కాదు. ఈ సవరణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మరొకటి కాదు. ఏఐఎస్ సవరణను ఇట్లా దొడ్డి దారిన కాకుండా.. కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే పార్లమెంట్ ప్రక్రియ ద్వారా సవరించాలి. రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఉండాలంటే.. రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తరువాత రాజ్యాంగ సవరనలు చేపట్టాలనే నిబంధనను ఆర్టికల్ 368(2) లో రాజ్యాంగ నిర్మాతలు దూర దృష్టితో పొందుపరిచారు.
ఏఐఎస్ అధికారులను రాష్ట్రాల్లో సామరస్యతతో చక్కని సమతుల్యతతో వినియోగించుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఏఐఎస్ క్యాడర్ రూల్స్ సరిపోతాయి అని. ఈ తరుణంలో పరిపాలన పరమైన పారదర్శకతను రాజ్యాంగ సమాఖ్య రాజనీతిని కొనసాగించాలని.. అందుకు ప్రస్తుతం కేంద్రం చేపట్టిన ప్రతిపాదిత సవరణలు నిలిపివేయాలి డిమాండ్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.