కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రోజే కాళేశ్వరంలో అవకతవకలకు కారణమని చెప్పి కేసీయార్ పై ఏసీబీలో ఫిర్యాదు దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో కేసీయార్ వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని లాయర్ రాపోలు భాస్కర్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కు ఫిర్యాదు చేశారు. ఈ దోపిడీలో మంత్రులుగా పనిచేసిన కేటీయార్, హరీష్ రావు, కవిత, ఇంజనీర్లతో పాటు ప్రాజెక్టును  నిర్మించిన మెఘా ఇంజనీరింగ్ సంస్ధను కూడా చేర్చారు.





అయితే ప్రాజెక్టును నిర్మించింది ఎల్ అండ్ టీ అనే ప్రచారం కూడా జరుగుతోంది. దాంతో ప్రాజెక్టును నిర్మించిన సంస్ధ ఏదనే విషయమై అయోమయం మొదలైంది. సరే అయోమయం మాటెలాగున్నా పిటీషనర్ అయితే కేసీయార్ మీద ఫిర్యాదుచేసింది వాస్తవం. తన ఫిర్యాదుపై సమగ్రంగా దర్యాప్తు జరిపి దోషులపైన చర్యలు తీసుకోవాలని లాయర్ ఏసీబీని కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలన్నీ ఇపుడు బయటపడుతున్నట్లు లాయర్ చెప్పారు. ఏ అర్హతతో కేసీయార్ ప్రాజెక్టును తానే రీ డిజైనింగ్ చేసినట్లు ప్రకటించారో తెలీటంలేదన్నారు.





తాగు, సాగునీటికి ఉద్దేశించిన కాళేశ్వరంలో అనేక లోపాలు బయటపడుతున్నట్లు లాయర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టులో కూడా అనేక లోపాలు బయటపడుతున్నాయని తన పిర్యాదులో చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిపోవటం, దాని ఫలితంగా బ్యారేజీకి కూడా చీలిక రావటాన్ని లాయర్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణంలో అనేక ఇంజనీరింగ్ లోపాలున్న విషయాన్ని కేంద్ర నిపుణుల బృందం బయటపెట్టిన విషయాలను కూడా పిటీషన్లో లాయర్ గుర్తుచేశారు. సరే ఫిర్యాదు  విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇప్పటికిప్పుడు కేసీయార్ మీద ఎలాంటి యాక్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో చేరారు కాబట్టి. 




ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా నిర్మాణం రు. 40 వేల కోట్లని ఫైనల్ చేసిన విషయాన్ని చెప్పారు. అయితే కేసీయార్ సీఎం కాగానే అంచనా వ్యాయాన్ని రీ డిజైనింగ్ పేరుతో రు. 1-1.15 లక్షలకోట్లకు పెంచారని ఆరోపించారు. వేలాది కోట్ల రూపాయలు దోచుకునేందుకే రీ డిజైనింగ్ ను సాకుగా కేసీయార్ చూపారని పిటీషనర్ ఆరోపించారు. అధికార దుర్వినియోగంతో ప్రజాధనాన్ని దోచుకున్న కేసీయార్ మీద దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకోవాలని కోరారు. మరి ఏసీబీ ఏమిచేస్తుందో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: