* గుడివాడలో కొడాలి నానికి గట్టి పోటీ

* బలపడుతున్న టీడీపీ అభ్యర్థి

* ఈసారి గెలిస్తే నాని ఖాతాలో హ్యాట్రిక్ విజయాలు  

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థులను తన మాటలతో చిత్తు చేసే ఈ రాజకీయ నేత 2024 అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలవడం అతనికి ముఖ్యంగా మారింది. తన కుటుంబం నుంచి కూడా ఎవరూ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వరని క్లారిటీ ఇచ్చారు. తన తమ్ముడి కుమారుడు మాత్రం పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైసీపీ మరోసారి గెలుపొందడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఆఖరి సారిగా నిలబడుతున్న కొడాలి నాని గెలుస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గుడివాడలో కొడాలి నానికి ప్రత్యర్థిగా వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. రాము టీడీపీ అభ్యర్థిగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. రాము, కొడాలి నాని మధ్య ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. గుడివాడ వైసీపీలో మంచి పేరున్న మైనారిటీ నేత షేక్ మౌలాలి ఇటీవల టీడీపీలో చేరడం నానికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల కొన్ని ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది.

రహదారులపై ఉన్న గుంతలు కూడా వైసీపీ ప్రభుత్వం పూడ్చలేకపోయిందని టీడీపీ పార్టీ నాయకులు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. గుడివాడలో బెట్టింగ్స్‌, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు బీభత్సంగా పెరిగిపోయాయని అన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పడి గుడివాడ అభివృద్ధి కావాలంటే వెనిగండ్ల రాముని గెలిపించాలని వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే కొడాలి నాని వైసీపీలో ఉండటం వల్ల గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కొడాలి నానికి మంచి అభిప్రాయమే ప్రజల్లో ఉంది. టీడీపీ పార్టీ వాళ్లు అతన్ని తక్కువ చేసి చూపించేలా ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకులు కామెంట్లు చేస్తున్నారు. 2014, 2019 రెండుసార్లు కొడాలి నాని పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి కూడా విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: