తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హీట్‌ పెరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో అందరి దృష్టి ఒకే అంశంపై నిలిచింది – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..? రారా..? అన్న ప్రశ్న. దాదాపు ఈ సస్పెన్స్‌కు తెరపడినట్టే తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీకి ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నది కాళేశ్వరం ప్రాజెక్ట్. కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను సర్కారు సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నివేదిక చుట్టూనే చర్చ కూడా ముమ్మరంగా జరగనుంది. స్పీకర్ ప్రసాదరావు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

ఇక కేసీఆర్ వస్తారా అనే విషయంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీష్ రావు లాంటి శక్తివంతమైన వక్తలు ఉన్నా.. ప్రజలతో పేగు బంధం కలిగిన కేసీఆర్ స్వయంగా సభలో నిలబడి మాట్లాడితే వచ్చే ప్రభావం వేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటోంది. “వచ్చి మాట్లాడండి” అనే పిలుపునిచ్చింది. తాజాగా ఫామ్‌హౌస్‌ నుంచి కేసీఆర్ కీలక నాయకులతో ఫోన్‌లో చర్చించినట్టు సమాచారం. "నేను కూడా అసెంబ్లీకి వస్తాను.. కానీ ముందు మీరు వెళ్ళండి, అక్కడ బలంగా వాదనలు వినిపించండి" అని ఆయన సూచించినట్టు చెబుతున్నారు. వర్షాలు, ప్రజల సమస్యలు, అవినీతి, కాళేశ్వరం, ఇతర స్కామ్‌లు అన్నీ లేవనెత్తాలని ఆయన ఆదేశించారు.

అయితే కేసీఆర్ ఎప్పుడు వస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. బీఆర్‌ఎస్ అంచనా ప్రకారం – కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం సభలో ఉంచటానికి 2-3 రోజులు పడుతుంది. అప్పటి వరకు కేసీఆర్ వెయిట్ చేస్తారట. నివేదికపై ప్రభుత్వ వాదనను లైవ్‌లో విని, తన కౌంటర్ సిద్ధం చేసుకుని సభలోకి ఎంట్రీ ఇస్తారని బీఆర్‌ఎస్ లో టాక్. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గితే మాత్రం కేసీఆర్ కూడా వెనుకడుగు వేయొచ్చని అంటున్నారు. మొత్తానికి, కాళేశ్వరం చర్చతో అసెంబ్లీ సెషన్స్ హాట్ హాట్‌గా ఉండబోతున్నాయి. కేసీఆర్ ఎంట్రీ ఎప్పుడు..? ఎలా..? అనేది మాత్రమే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: